సి.బి.ఐ ఎంక్వైరీ వేయాలి : బుద్దా
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీకి వాణిని మీడియాలో వినిపించే నేత బుద్దా వెంకన్న. ఆయన ఆ పార్టీకి రాష్ట్రప్రధాన కార్యదర్శి. అంతేకాదండోయ్ ఆ పార్టీకి ఉత్తరాంధ్ర ప్రాంత ఇన్ చార్జ్ కూడా. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లో పట్టుబడిన డ్రగ్స్ రవాణా పై నిత్యం రాజకీయ పార్టీల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో బుద్దా వెంకన్న ఓ కొత్త డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సి.బి.ఐ విచారణ జరపాలని కోరారు. తనకు ఎట్లా తెలిసిందో కానీ ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల నుంచి తాడేపల్లి ప్యాలెస్ కి డ్రగ్స్ రవాణా జరుగుతోందని కొత్త విషయం చెప్పారు. రాష్ట్రంలో కోడిగుడ్ల వాడకంకంటే డ్రగ్స్ వాడకం అధికమైందన్నారు. ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని విమర్శించారు. దాదాపు 21వేలకోట్ల రూపాయల విలువైన హెరాయిన్ పట్టుబడితే ప్రభుత్వంలోని అధికారులు స్పందించకపోవడం శచనీయమని తెలిపారు. టీస్టాళ్లు, బడ్డీకొట్లు, కిళ్లీకొట్లలో మాదకద్రవ్యాలు అమ్ముతుంటే, ఇంటిలిజెన్స్ వ్యవస్థ నిద్రపోతోందా ? అంటూ ప్రశ్నించారు.
గుజరాత్ పోర్టులో రూ.21వేలకోట్ల విలువైన హెరాయిన్ తో పట్టుబడిన సుధాకర్ అనే వ్యక్తి, కాకినాడ వైసీపీనేతకు బినామీ అని తెలిపారు. రాష్ట్రంలో ఎగుమతులు, దిగుమతుల ఎలా ఉన్నా మాదకద్రవ్యాల ఎగుమతి, దిగుమతి, అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈ దందా వెనుక ప్రభుత్వ బిగ్ బాస్ హస్తముందని బుద్దా వెంకన్న ఆరోపించారు. బిగ్ బాస్ పైన, ఇతర అధికార పార్టీ నేతల పైన సి.బి.ఐ విచారణకు అదేశిస్తే అన్ని వ్యవహారాలు వెలుగు చూస్తాయని చెప్పారు. సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే కేంద్ర ప్రభుత్వమైనా జోక్యం చేసుకోవాలని బుద్దా వెంకన్న కోరారు. ఆంధ్ర ప్రదేశ్ డి.జి.పి త్రివిక్రమ వర్మ పోలీసుల పరువు తీస్తున్నారని ఆరోపించారు. మాజీ ముఖ్యమం్రతి ఇంటిపై దాడికి దిగిన అధికార పార్టీ శాసన సభ్యులు,నేతలను ఆయన సమర్థించడం శోచనీయమని వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు.