ఇండియాలో అధిక సంఖ్య కార్ల అమ్మకాలు నమోదవుతున్న నేపథ్యంలో అన్ని కంపెనీలు కూడా పోటాపోటీగా కార్లను రిలీజ్ చేస్తున్నాయి. ఇటీవల ఎస్యూవీ రంగంలో తనదైన మార్క్ చూపించిన మహీంద్రా థార్కు పోటీగా మారుతీ సుజుకీ కంపెనీ కూడా మరో కొత్త ఎస్యూవీను లాంచ్ చేస్తుంది.మారుతి సుజుకి జిమ్నీ పేరుతో లాంచ్ చేయబోతున్న ఈ ఎస్యూవీను జూన్ 7న లాంచ్ చేస్తారని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు.అయితే ఈ ఎస్యూవీ ఈ నెలలోనే భారతదేశంలో లాంచ్ అవుతుందని భావించారు. మారుతి సుజుకి జిమ్నీ గురించి 2023 ప్రారంభం నుంచి చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్పో 2023లో ఈ కార్ను లాంచ్ చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం మారుతి సుజుకి జిమ్నీని కంపెనీకు చెందిన గుర్గావ్ ప్లాంట్లో తయారు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇండియాలో జిమ్నీ కోసం 30,000 కంటే ఎక్కువ బుకింగ్లను పొందింది . జూన్ మొదటి వారంలో ఈ ఎస్యూవీ కార్ల డెలివరీలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. ఈ కార్ ఫీచర్లు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ కొత్త జిమ్నీ 103 హార్స్పవర్తో 134 ఎన్ఎం గరిష్ట టార్క్ను జనరేట్ చేస్తుంది. 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్తో ఇది పనిచేస్తుంది. అలాగే వినియోగదారులు లీటర్కు 16.94 కిలోమీటర్ల మైలేజ్ను పొందుతారు.ఈ కార్లో 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇంకా 16.39 కిలోమీటర్ల మైలేజీతో 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మధ్య ఎంచుకునే ఛాన్స్ ఉంది.ఇండియాలో మారుతి సుజుకి జిమ్నీ ధర రూ. 9.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద ప్రారంభమవుతుంది. ఈ కార్ వినియోగదారులకు మంచి ఫీచర్లను అందిస్తుంది.ఈ మారుతి సుజుకి జిమ్నీ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. జీటా, ఆల్ఫా వెర్షన్లలో ఈ కార్ మనకు అందుబాటులో ఉంటుంది. అలాగే మాన్యువల్ ట్రాన్స్మిషన్తో కూడిన బేస్ జీటా వేరియంట్ ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఇంకా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో కూడిన లైన్ ఆల్ఫా వేరియంట్ ధర రూ. 13.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇప్పటి దాకా జిమ్నీ 3-డోర్ వెర్షన్లో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో విక్రయించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3.2 మిలియన్ యూనిట్ల జిమ్నీని అమ్మినట్లు కంపెనీ పేర్కొంది. కాబట్టి ఇప్పడు కొత్తగా 5 డోర్ వెర్షన్తో విడుదల చేస్తున్న ఈ భారతీయ వేరియంట్ను ఎస్యూవీ మార్కెట్లో అగ్రస్థానంలో ఉంచాలని మారుతీ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.