నగర నిర్మాణంలో మహిళలకు ప్రాధాన్యం.. ఇలా జరగడం ఇదే ఫస్ట్!

P.Phanindra
నగరాలు దేశాల మణిహారంలో పచ్చలు. వీటి నిర్మాణంలో ఏ దేశమూ ప్రత్యేకంగా మహిళల కోసమో, పురుషుల కోసమో నగరాల నిర్మాణంలో మార్పులు చేయదు. ఇప్పటి వరకూ చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదు. కానీ చరిత్రలోనే తొలిసారిగా భారత దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరం మహిళల కోసం నగరంలో ప్రత్యేక సదుపాయాలు నిర్మించాలని నిర్ణయించింది.

ఇలా ఓ జెండర్ కోసం నగర నిర్మాణంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. మహిళల అవసరాలను తీర్చే విధంగా భౌగోళిక, సామాజిక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ను డిజైన్ చేసింది ముంబై. డ్రాఫ్ట్ డెవలప్‌మెంట్ ప్లాన్ 2034 ప్రతిపాదనలో ఈ సరికొత్త యోచనలు చేసింది. వీటిలో 90 భూ రిజర్వేషన్లను మహిళల కోసమే చేసినట్లు పేర్కొంది. మహిళల అవసరాలకు అనుగుణంగా హౌసింగ్, చదువు, మహిళా భద్రత, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధతో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.

ముఖ్యంగా మహిళల కోసం ప్రత్యేకంగా సియోన్-కోలివాడా ప్రాంతంలో ఓ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే గోరెగావ్ ప్రాంతంలో వర్కింగ్ మహిళల కోసం నిర్మిస్తున్న ఓ చైల్డ్ కేర్ సెంటర్‌ కూడా పూర్తి కావొచ్చిందట. ఇదే ప్రాంతంలో పెద్ద వయసులోని మహిళల కోసం రెండు షెల్టర్ హోంలు కూడా నిర్మించడం కోసం బిడ్డింగ్ వేయబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తం 24 మున్సిపల్ వార్డుల్లో కూడా ఇలా మహిళల కోసం ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని, ఇటువంటి ప్లాన్ మరే భారతీయ నగర నిర్మాణంలోనూ కనిపించదని ముంబై అధికారులు గర్వంగా చెప్తున్నారు.

అక్షర ఫౌండేషన్‌కు చెందిన నందితా షా వంటి వారు ఇలా మహిళల కోసం ప్రత్యేక నిర్మాణాల ఏర్పాటులో కీలక పాత్ర వహిస్తున్నారని సమాచారం. ఏది ఏమైనా ఇలా మహిళల కోసం ఓ  నగర నిర్మాణంలో ప్రత్యేకంగా సదుపాయాలు ఏర్పాటు చేయడం వాటిని నగర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో భాగం చేయడం ఇదే తొలిసారి. ఈ విషయం విన్న వారంతా ఇది నిజంగా మహిళల విజయమే అంటూ కొనియాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: