ప్రేమికుల దినోత్సవం..రిలయన్స్ జియో శుభవార్త..!

Vamsi
భారత దేశంలో కమ్యూనికేషన్ రంగంలో పెను సంచలనాలు సృష్టిస్తున్న రిలయన్స్ జియో ఇప్పటికే ఎన్నో ఆఫర్లు ప్రకటిస్తూ వచ్చింది.  దీని దెబ్బకు ఇతర నెట్ వర్క్ సంస్థలు కూడా ఆఫర్లు మీద ఆఫర్లు ప్రకటిస్తూ వస్తున్నాయి.  తాజాగా ప్రేమికుల దినోత్సవం నాడు రిలయన్స్ జియో శుభవార్త చెప్పింది. నేటి నుంచి జియో ఫీచర్ ఫోన్లలో ఎంచక్కా ఫేస్‌బుక్‌ను ఎంజాయ్ చేయొచ్చని పేర్కొంది. జియో ఫోన్ల కోసం కొత్తగా ‘కై’ ఓఎస్‌తో పనిచేసే ఫేస్‌బుక్ యాప్‌ను అభివృద్ధి చేసింది.

నేటి నుంచి దీనిని జియో యాప్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.   ఇప్పటికే పలు కొత్త కొత్త ఫీచర్లు తీసుకు వస్తున్న జియో తాజాగా ఫేస్ బుక్ సౌలభ్యం తీసుకు రావడంతో వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  ట్రాన్స్‌ఫార్మేషనల్ టెక్నాలజీతో తీసుకొచ్చిన జియో ఫోన్ ప్రపంచంలోనే అతి చవకైన ఫీచర్ ఫోన్.

ఈ ఫోన్‌ను విడుదల చేయడం ద్వారా దేశంలోని 2జీ వినియోగదారులను జియో తనవైపు తిప్పుకుంది. జియోతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని ఫేస్‌బుక్ మొబైల్ పార్ట్‌నర్‌షిప్ ఉపాధ్యక్షుడు ఫ్రాన్సిస్కో వరెలా తెలిపారు. ఫేస్‌బుక్‌ను అందుబాటులోకి తెచ్చిన జియో అతి త్వరలోనే వాట్సాప్‌ను కూడా తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందని జియో వర్గాల సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: