టెక్నాలజీ: స్మార్ట్ఫోన్ ఎన్ని గంటలు వాడాలో తెలుసా..?
ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ఫోన్నే దర్శనమిస్తోంది. ఎందుకంటే.. ఇప్పుడంతా మొబైల్ ఫోన్ల ట్రెండ్ నడుస్తోంది. రకరకాల ఫీచర్లతో ఆకట్టుకునే రీతిలో రోజుకో మొబైల్ మార్కెట్లోకి విడుదలవుతోంది. ఆఫర్లంటూ ఊరించి వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. మరోవైపు టెలికమ్ కంపెనీలు కూడా కస్టమర్లను ఆకట్టుకునేందుకు అదిరిపోయే ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. దీంతో స్మార్ట్ఫోన్ వినియోగం భారీగా పెరిగిపోయింది. కాలేజీ యువత నుంచి పండు ముదుసళ్ల వరకూ.. గృహిణుల మొదలు ఉద్యోగినుల వరకూ.. బిజినెస్ చేసే వారితో పాటు బిచ్చగాడి దాకా.. అందరి వద్దా స్మార్ట్ఫోన్లు ఉంటున్నాయి.
చేతిలో ఇమిడిపోయే ఈ మినీ తెరలో ఓటీటీలు, యూట్యూబ్ వీడియోలను చూస్తూ టైంపాస్ చేస్తున్నారు. అయితే, కొంతమంది రాత్రిళ్లు నిద్రలు మానుకొని మరీ వీటిని చూస్తున్నారు. ఈ క్రమంలోనే తమ ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. అయితే రోజుకు 5 గంటల కన్నా ఎక్కువగా వాడితే మాత్రం ప్రమాదమేనని సైంటిస్టులు చెబుతున్నారు. గుండె జబ్బులు, డయాబెటిస్ తదితర అనారోగ్య సమస్యలకు గురి కావల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. ఇటీవల విద్యార్థులపై చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. ఈ ఆధ్యయనంలో విద్యార్థులకు ఉన్న ఆహారపు అలవాట్లు, జబ్బులు తదితర వివరాలను సైంటిస్టులు సేకరించారు.
అలాగే వారు నిత్యం ఎన్ని గంటల పాటు స్మార్ట్ఫోన్ను వాడుతారనే వివరాలను కూడా రాబట్టారు. ఈ క్రమంలోనే స్మార్ట్ఫోన్ను నిత్యం ఐదు గంటల కన్నా ఎక్కువగా వాడే విద్యార్థులు స్థూలకాయం బారిన పడే అవకాశాలు 42.6 శాతం వరకు ఎక్కువగా ఉంటాయని, అదే విద్యార్థినులు అయితే ఆ అవకాశాలు 57.4 శాతం వరకు ఉంటాయని తేల్చారు. ఈ క్రమంలోనే స్థూలకాయం వల్ల డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుందని తేల్చిచెప్పారు. అంతేకాకుండా.. మొబైల్ లైటింగ్ వల్ల కళ్లు, రేడియేషన్ వల్ల మెదడు దెబ్బతింటాయి. సో.. ఐదు గంటల కన్నా మించి మాత్రం స్మార్ట్ఫోన్లు వాడకండి.