టీం ఇండియా మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే మరో సారి కోచ్ అవతారమెత్తనున్నాడు. ఇంతకుముందు భారత జట్టుకు ప్రధాన కోచ్ గా పనిచేసిన కుంబ్లే తాజాగా ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కు ప్రధాన కోచ్ గా వ్యవహరించనున్నాడు. కుంబ్లే తోపాటు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జార్జ్ బెయిలీ పంజాబ్ బ్యాటింగ్ కోచ్ గా అలాగే కోట్ని వాల్ష్ బౌలింగ్ కోచ్ గా , జాంటీ రోడ్స్ ఫీల్డింగ్ కోచ్ గా వ్యవహారించనున్నారని ఆ జట్టు యాజమాన్యం అధికారంగా ప్రకటించింది. ఇక ఐపీఎల్ లో కోచ్ గా అనిల్ కుంబ్లే నియామకం జరగడం ఇదే మొదటి సారి. ఇంతకుముందు ముంబై ఇండియన్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్లకు మెంటర్ గా వ్యవహరించాడు కుంబ్లే. మరి సీజన్లు మరీనా.. ప్రదర్శన లో ఏం మార్పు లేకుండా కొనసాగుతున్న పంజాబ్ తల రాతను కుంబ్లే మారుస్తాడో లేదో చూడాలి.
ఇదిలా ఉంటే పంజాబ్ ప్రస్తుత కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఢిల్లీ క్యాపిటల్స్ కు మారాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈనేపథ్యం లో కోచ్ గా కుంబ్లే నిర్ణయం కీలకం కానుంది. అయితే గత రెండు సీజన్ల నుండి పంజాబ్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న అశ్విన్.. జట్టును ముందుండి నడిపించడం లో విఫలమవుతున్నాడు దాంతో పంజాబ్ యాజమాన్యం కూడా అశ్విన్ ను సాగనంపాలని భావిస్తుంది.