ఐపీఎల్ ప్రత్యక్ష ప్రసారంలో భాగంగా బీసీసీఐ కృత్రిమ మేథను వాడుకుంటున్న సంగతి మీరు గమనించే ఉంటారు. అవును, వీక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించేందుకు బీసీసీఐ కృత్రిమ మేథతో పని చేసే రోబో డాగ్ను ప్రవేశ పెట్టింది. ఇక దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు కూడా చేయడం జరిగింది. బ్రాడ్కాస్టింగ్ టీమ్లో చేరిన రోబో డాగ్ను ప్రముఖ కామెంటేటర్ డానీ మారిసన్ పరిచయం చేశాడు. ముంబై, ఢిల్లీ జట్లు సాధన చేస్తున్న సమయంలో ఆటగాళ్లను ఈ కొత్త అతిథి పలకరించింది. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యాకు షేక్ హ్యాండ్ ఇచ్చి, మారిసన్ వాయిస్ కమాండ్లకు తగ్గట్టుగా ఫీట్లు చేసి అలరించింది. అదే సమయంలో LSGతో మ్యాచ్ ప్రారంభానికి ముందు ధోనీ గ్రౌండ్లోకి వచ్చిన వెంటనే, సదరు రోబో కెమెరా తన దగ్గరకు వెళ్ళింది. దాంతో ధోనిలోని చిన్నపిల్లాడు బయటకు వచ్చాడు. అలా వచ్చిన రోబోని వెల్లికిలా పడుకోబెట్టి వెళ్ళిపోయాడు నవ్వుతూ! ఇక చేసేదేమిలేక దాని ఆపరేటర్ వచ్చి ఆ రోబోని పైకి లేపాడు. కాగా ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే IPL (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 25లో భాగంగా జరిగిన 30వ మ్యాచ్లో సీఎస్కే జట్టు లక్నోను 5 వికెట్ల తేడాతో ఓడించి ప్రస్తుత సీజన్లో రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. వరుసగా 5 మ్యాచ్ ల్లో ఓడిన తర్వాత సీఎస్కే జట్టు తిరిగి గెలుపు బాటలో పయనించడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. లక్నో సూపర్ జెయింట్స్ దాని సొంత మైదానంలో ఓడించడం ద్వారా సీఎస్కే గత ఏడాది తన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్ లో సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని మ్యాచ్ ఫినిషర్ పాత్రను చాలా చక్కగా పోషించాడు. 11 బంతుల్లో అజేయంగా 26 పరుగులు చేసి జట్టుకు ఉత్కంఠభరితమైన విజయాన్ని అందించడంలో కీలకపాత్రని పోషించాడు. ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని చెన్నై సూపర్ కింగ్స్ 3 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విధంగా ప్రస్తుత సీజన్ లో ఏడో మ్యాచ్ లో సీఎస్కే తన రెండో విజయాన్ని నమోదు చేసింది.