కాస్త అతన్ని కూడా చూపించబ్బా.. ఐపీఎల్ కెమెరామెన్ పై సెహ్వాగ్ సెటైర్?
ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి కూడా చెన్నై సూపర్ కింగ్స్ కి ధోని కెప్టెన్గా కొనసాగుతూ వస్తున్నాడు. ఐదు సార్లు టైటిల్ కూడా అందించాడు. అయితే ఇక ఇప్పుడు ధోని కెరియర్ ముగింపు దశలో ఉన్న నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతలను యువ ఆటగాడు రుతురాజు గైక్వాడ్ కు అప్పగించాడు ధోని. ఈ క్రమంలోనే ధోని పక్కనే ఉండి కెప్టెన్సీ లో అతన్ని మరింత మెరుగుపరిచేందుకు ఆటగాడిగా జట్టులో కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇటీవల మొదటి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన పోరులో విజయం సాధించింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.
అందరూ ఈ విజయం గురించే మాట్లాడుకుంటూ ఉండగా.. ఇక ఈ మ్యాచ్ గురించి మాట్లాడిన టీమిండియా మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో సెటైర్ వేశాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ అనగానే అందరూ దృష్టి దోని పైన ఉంటుంది. ఈ సీజన్లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోని క్రేజ్ మాత్రం తగ్గలేదు. అందుకే ఇక మొదటి మ్యాచ్ లో కెమెరామెన్ కూడా ధోనినే ఎక్కువగా చూపించాడు. రుతురాజ్ కెమెరా ఫోకస్ లో ఎక్కడా కనిపించలేదు. అయితే మ్యాచ్ చూస్తూ ఇది గమనించిన మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ కెమెరామెన్ పై సెటైర్ వేశాడు. ధోనితో పాటు రుతురాజ్ ని కూడా చూపించాలని.. అతను ప్రస్తుతం చెన్నై కెప్టెన్ అంటూ గుర్తు చేశాడు వీరేందర్ సెహ్వాగ్.