ఆ టాలెంటెడ్ ప్లేయర్ కి.. టీమిండియాలో చోటు గల్లంతైనట్లేనా?
అతను ఎవరో కాదు.. ఝార్ఖండ్ డైనమైట్ గా పిలుచుకునే ఇషాన్ కిషన్. అతనికి గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియాలో వరుసగా చాన్సులు దక్కుతున్నాయి. రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం బారిన పడటంతో ఇక టీమిండియా కు రెగ్యులర్ వికెట్ కీపర్ గా మారిపోయాడు. ఇక భారత జట్టులోను నిలకడగా రాణించాడు. కానీ సౌత్ ఆఫ్రికా పర్యటనలో చివరికి మానసిక ఆందోళన ఉంది అంటూ చెప్పి జట్టుకు దూరమయ్యాడు. అతను చెప్పిన కారణం సెలెక్టర్లకు నచ్చలేదో లేకపోతే అతనే జట్టుకు దూరంగా ఉండాలి అనుకున్నాడో తెలియదు కానీ ఇక ఇప్పుడు జనవరి 11వ తేదీ నుంచి ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ కి కూడా సెలక్టర్లు అతని ఎంపిక చేయలేదు.
దీంతో ఈ ఝార్ఖండ్ కుర్రాడికి ఏమైంది అంటూ అందరూ చర్చించుకుంటున్నారు. అయితే ఇక ఇషాన్ కిషన్ కి ఇప్పట్లో మళ్ళీ జట్టులో చోటు దక్కే అవకాశం మాత్రం లేదు అని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే సీనియర్లు కోహ్లీ, రోహిత్ లు జట్టులోకి వచ్చారు. కేఎల్ రాహుల్ గాయం బారిన పడటంతో జట్టులో వరుసగా అవకాశాలు అందుకున్న ఇషాన్ కిషన్ అతని రాకతో ఇక బెంచ్ కి పరిమితమయ్యాడు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలుస్తుంది. ఇక వన్డే ప్రపంచకప్ లో కూడా గిల్ గైర్హాజరుతో అవకాశాలు దక్కించుకున్నాడు. తర్వాత బెంచ్ కి పరిమితమయ్యాడు. సౌత్ ఆఫ్రికా పర్యటన నుంచి అర్ధాంతరంగా తిరిగి వచ్చేసాడు. దీంతో ఇషాన్ కిషన్ కి ఇప్పట్లో మళ్ళీ టీమిండియాలో చోటు దక్కే అవకాశం లేదు అని ఆకాష్ చోప్రా వ్యాఖ్యానించాడు.