వెస్ట్ ఇండీస్ పై టెస్టు సిరీస్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన టీం ఇండియాఇప్పుడు వన్డే సిరీస్పై కూడా కన్నేసింది. ఈ మూడు మ్యాచ్ల సిరీస్లో తొలి పోరు గురువారమే జరగనుంది.ఇక టెస్టుల్లో ఇండియా ధాటికి నిలవలేకపోయిన వెస్టిండీస్.. వన్డేల్లో ఏమాత్రం పోరాడుతుందన్నది మాత్రం సందేహంగా ఉంది. ఇప్పటికే వన్డే ప్రపంచకప్కు దూరమైన బాధలో ఆ జట్టు ఉంటే.. సొంతగడ్డపై ఫేవరెట్గా మెగా టోర్నీ బరిలోకి దిగబోతున్న టీం ఇండియా ఈ సిరీస్లో తన ఆధిపత్యాన్ని చాటాలనుకుంటోంది.వెస్టిండీస్తో సెకండ్ టెస్టులో చివరి రెండు రోజుల్లో వర్షం వల్ల సిరీస్లో 1-0 విజయంతో మాత్రమే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. లేదంటే రెండు మ్యాచ్ల సిరీస్ను టీమ్ఇండియా ఈజీగా క్లీన్స్వీప్ చేసేదే.అలాగే సిరీస్లో ఆతిథ్య జట్టు నుంచి కనీస పోటీ కూడా లేకపోయింది. నానాటికీ తీసికట్టుగా తయారవుతున్న కరీబియన్ టీం పెర్ఫార్మన్స్ వన్డే సిరీస్లో ఏమాత్రం మెరుగుపడుతుందో చూడాలి. అయితే విండీస్ వన్డే టీంలో కొందరు ప్రపంచ స్థాయి ఆటగాళ్లున్న నేపథ్యంలో ఇండియాకి కొంత ప్రతిఘటన ఎదురు కావచ్చు. వన్డే ప్రపంచకప్ దగ్గర పడుతున్న క్రమంలో ప్రత్యర్థిని తేలిగ్గా తీసుకోకుండా టీం ఇండియా మంచి పెర్ఫార్మన్స్ చేయాల్సిందే.
ఇక ప్రత్యర్థి నుంచి సిరీస్లో ఏమాత్రం పోటీ ఎదురవుతుందో కానీ.. భారత తుది జట్టులో చోటు కోసం మన ఆటగాళ్ల మధ్య ఇప్పుడు చాలా గట్టి పోటీ కనిపిస్తోంది. ప్రపంచకప్ జట్టులో చోటే లక్ష్యంగా కొందరు యువ ఆటగాళ్లు ఈ సిరీస్లో తమ సత్తాని చాటాలనుకుంటున్నారు. ఇక టీ20ల్లో ప్రపంచ మేటి బ్యాటర్గా ఎదిగిన సూర్యకుమార్ యాదవ్.. వన్డేల్లో అతనేంటో ఇంకా రుజువు చేసుకోలేదు. అయితే గతంలో దక్కిన అవకాశాలను అతను ఉపయోగించుకోలేదు. ఇక శ్రేయస్ అయ్యర్ కూడా అందుబాటులో లేని నేపథ్యంలో అతడికి తుది జట్టులో ప్లేస్ దక్కడం ఖాయం. సిరీస్లో అతను తనదైన ముద్ర వేయకుంటే ప్రపంచకప్లో ఆడటంపై ఖచ్చితంగా ఆశలు వదులుకోవాల్సిందే. ఇంకా మరోవైపు వికెట్ కీపర్ ప్లేస్ కోసం ఇషాన్ కిషన్తో సంజు శాంసన్ పోటీ పడుతున్నాడు. ఇక ఇప్పటికే వన్డేల్లో డబుల్ సెంచరీతో పాటు కొన్ని మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్కే ప్రాధాన్యం ఇస్తారా.. లేక చాలినన్ని అవకాశాలు దక్కించుకోలేకపోయిన సంజు శాంసన్ ను ఆడిస్తారా అన్నది చూడాలి.