మొదట్లో 1000, ఆ తర్వాత 2000 ఇప్పుడు ఏకంగా 5000 మందికి అనుమతి!

SS Marvels
శబరిమలై శ్రీ అయ్యప్పస్వామి వారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు కేరళ ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. స్వామివారి దర్శనానికి అనుమతించే భక్తుల సంఖ్యను రెట్టింపు చేస్తున్నట్టు ప్రకటించింది. మండలపూజ ప్రారంభమైనప్పుడు తొలుత రోజుకు 1,000 మందినే అనుమతించగా, కొద్ది రోజుల తర్వాత ఆ సంఖ్యను రోజుకు 2 వేలకు పెంచింది. తాజాగా రోజుకు 5,000 మంది భక్తులను దర్శనానికి అనుమతిస్తామని పేర్కొంది. డిసెంబరు 26 నుంచి ఇది అమల్లోకి రానుంది. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ టిక్కెట్ల బుకింగ్ మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభమయ్యింది. ప్రస్తుతం సాధారణ రోజుల్లో రోజుకు 2,000 మందిని, వారాంతాలు, సెలవు రోజుల్లో 3 వేల మందిని దర్శనానికి అనుమతిస్తున్నారు. తాజా నిర్ణయంతో సాధారణ రోజుల్లో 5 వేల మందిని, శని, ఆదివారాల్లో ఆరు వేల మందిని అనుమతించనున్నారు.

అయితే, దర్శనానికి వచ్చే భక్తులకు సంబంధించిన నిబంధనల్లో ఎటువంటి మార్పులు లేవని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు స్పష్టం చేశారు. భక్తుల నుంచి వచ్చిన విజ్ఞ‌ప్తి మేరకు దర్శనాల సంఖ్యను పెంచినట్టు తెలిపింది. ఆన్‌లైన్‌లోనే ముందస్తుగా టికెట్లు బుక్‌ చేసుకోవాలని సూచించారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విధించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. నిలక్కళ్ చేరడానికి 24 గంటల ముందు కొవిడ్‌ నెగెటివ్‌ సర్టిఫికెట్ సమర్పించిన వారినే దర్శనానికి అనుమతించనున్నట్లు పేర్కొన్నారు. కేవలం ఆర్టీ-పీసీఆర్ టెస్ట్‌లు చేయించుకోవాలని సూచించింది.

భక్తులకు నిలక్కళ్ వద్ద కోవిడ్ పరీక్షలకు ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. గత మూడు వారాలుగా సన్నిధానం, పంబ వైద్య శిబిరాల వద్ద విధులు నిర్వర్తిస్తున్న పలు విభాగాలకు చెందిన సిబ్బందికి సోమవారం నుంచి కొవిడ్‌ పరీక్షలు చేసినట్లు అధికారులు తెలిపారు. రోజుకు సుమారు 200 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు వివరించారు. నవంబరు 16న ఆలయం తెరిచిన నాటి నుంచి ఇప్పటి వరకు చేసిన పరీక్షల్లో భక్తులు, పోలీసులు, ఆలయ సిబ్బందిలో 60 మందికి కొవిడ్‌ సోకినట్లు స్పష్టం చేశారు. డిసెంబరు 26న మండల పూజ, జనవరి 14న మకరవిళక్కు(మకర జ్యోతి దర్శనం) తర్వాత జనవరి 20న ఆలయాన్ని మూసివేయనున్నారు. ఇప్పుడు ఈ నిర్ణయం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: