నచ్చిన పని చేస్తే ఎంత లాభమో తెలుసుకోండి..!

ఏ పని చేసినా అందులో మనకు ఆసక్తి ఉండాలి. పని చేయడం ఒక్కటే లక్ష్యం కాకూడదు. ఆ పని మనకు ఆనందం కూడా కలిగించాలి. అప్పుడే దాన్ని ఆస్వాదిస్తూ పని చేయగలం. ఏ పనినైనా ఇష్టపడి చేయాలి. చేసే పనిలో ఆసక్తి, ఉత్సాహం, సంతోషం ఇమిడి ఉండాలి. అప్పుడే దక్కాల్సిన ఫలితం, దానంతటదే వచ్చి చేరుతుంది.



ఈ విషయానికి మనకు పురాణాల్లోనూ దృష్టాంతాలు లభిస్తాయి. నీతిశాలి, కార్యదక్షుడు, ప్రణాళికాబద్ధుడైన శ్రీరామచంద్రుడి కార్యాన్ని వానరాలే నిర్వహించాయి. సముద్రానికి సేతువు కట్టి, రాక్షస సేనను ఓడించి, సీతను రాముడికి అప్పగించాయి. అంటే.. యజమాని కార్యసాధకుడైతే, నేర్పరితనంతో ముందడుగు వేస్తే, సేవకులు అతడినే అనుసరిస్తారు.



ఉన్నతమైన ఆలోచనల్ని అమలుచేయాలంటే పనిలో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. ఇది నియమాలు, నిగ్రహశక్తి వల్ల సాధ్యపడుతుంది. దీక్షగా పని చేసేవారు ఎక్కువగా మాట్లాడరు. ఎందుకంటే- మాటలు, పనులు ఏకకాలంలో సాగవు. పనిచేస్తేనే మనిషి ఉక్కులా దృఢంగా ఉంటాడు. పని లేకపోతే సోమరిగా మారతాడు.



అంతే కాదు.. ఎంత సంపద ఉన్నా.. ఏ పనీ లేని మనిషిలో చెడు ఆలోచనలు ప్రవేశిస్తాయి. అశాంతి కారణంగా అతడు అనారోగ్యం పాలవుతాడు. మనిషి ఎంత ధనవంతుడైనా, ఏదో ఒక పనిమీద దృష్టిపెట్టాలి. భగవంతుడికి ప్రీతికరమైన సేవాకార్యక్రమాల్లోనైనా పాలుపంచుకోవాలి. ఒక పని సాధించాలనుకున్నప్పుడు ఎన్నో భయాలు, సందేహాలు కలగడం సహజం. అర్థం లేని భయాలు, అనుమానాలతో వెనకడుగు వేయడం కంటే ఆశావాదంతో అడుగు ముందుకు వేయడం మంచిది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: