దీపావళి స్పెషల్ : ఆరుబయట దీపాలు ఎందుకు వెలిగిస్తారు..?

Vasishta

హిందువుల ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. ఆ రోజు ప్రతి ఇంటి ముందు దీపాలు ప్రకాశిస్తూనే ఉంటాయి. ప్రతి పండుగకు పిండి వంటలు, కొత్త బట్టలు, సరదాలు, దీపారాధనలు ఉంటాయి. మరి దీపావళికి మాత్రమే దీపాల ప్రదర్శన ఎందుకు...? ఆరు బయట దీపాల పెట్టడం వెనుక కారణం ఏంటి..?


దీపావళి అంటే దీపాల క్రమం. దీపం వెలుగును పంచుతుంది. చైతన్యాన్ని ప్రతిఫలిస్తుంది. కమ్ముకున్న కారుచీకటి చీల్చివేస్తుంది. ఏటా ఆశ్వయుజ అమావాస్య నాడు దీపావళిని జరుపుకుంటారు. హిందువులు ప్రతి రోజు పూజ చేసేటప్పుడు దీపం వెలిగిస్తారు. పండుగలకూ తప్పనిసరిగా దీపారాధన చేస్తాం. దీపం పరబ్రహ్మస్వరూపం. అలాంటి దీపాలతో చేసే అపురూపమైన పండుగ దీపావళి.


దీపావళితో మొదలైన ఈ దివ్వెల శోభ కార్తీకమాసం మొత్తం కాంతులీనుతూనే ఉంటుంది. కార్తీక మాసంలో తులసిని పూజించి.. తులసి ముందు ఒక్క దీపాన్నైనా ఉంచితే మంచి జరుగుతుందని హిందువుల నమ్మకం. అమావాస్య నాడు చనిపోయిన పితృదేవతలకు తర్పణం విడిచే ఆచారం ఉంది. ఆ ప్రకారం పురుషులు జలతర్పణం విడుస్తుంటారు. ఇక్కడ వినిపించే ఇంకో పురాణ కథ ఏమిటంటే... మహాలయ పక్షంలో స్వర్గం నుంచి భూలోకానకి పితృదేవతలు దిగివచ్చి.. దీపావళి రోజున పితృలోకాలకు తిరిగి పయణమవుతారట. అలా వెళ్లే పితృదేవతలకు వెలుతురు చూపించడం కోసం ఆరు బయట దీపాలు వెలిగించే ఆచారం వచ్చిందట..


దీపావళి నాటి దీపకాంతి సహస్ర సూర్యులకాంతికి మించిందని శాస్త్రం చెబుతోంది. ఆ రోజు ఆవునేతితో లేదా నువ్వుల నూనేతో దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందట. ఎందుకంటే దీపంలో లక్ష్మీ దేవి ఉంటుందట. దీని వెనుక కూడా ఓ కథనం ఉంది. దేవతల అతిపథి ఇంద్రుడు శ్రీమహాలక్ష్మిని పూజిస్తూ... అమ్మా.. సామాన్యులు నీ కృపను పొందాలంటే ఏం చేయాలని అడుగాడట. అప్పుడు లక్ష్మీ దేవి “నన్ను త్రికరణశుద్ధిగా ఆరాధించే భక్తులకు ఎన్నడూ, ఏ లోటూ ఉండదు. దీపం వెలిగించి, ప్రార్థించే భక్తులకు అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తాను” అని బదులిస్తుందట. అప్పటి నుంచి దీపంలో లక్ష్మీదేవి రూపాన్ని దర్శించుకోవడం ఆనవాయితీగా మారింది. దీపావళి రోజు దీపాలతోనే పండుగ కాబట్టి... ఆ రోజు లక్ష్మీదేవిని ఆరాధించే ఆచారం ఏర్పడింది.


ఇంటి గడపకు పూసే పసుపు, వాకిట ముందు వేసే రంగవళ్లులు... ఇలా అనాదిగా వస్తున్న ప్రతి ఆచారం వెనుక ఓ శాస్త్రీయ కారణం ఉంది. దీపావళి వెనకు కూడా అలాంటి కారణాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం దీపావళి పండగను చెడు తొలగిపోయి మంచి మొదలవ్వాలనే ఉద్దేశంతో నిర్వహిస్తారు. వ్యాపారాభివృద్ధి, అష్ట ఐశ్వర్యాలు  సిద్ధించాలని లక్ష్మీకటాక్షం కోసం పూజలు చేస్తారు. ఇంటి బయట దీపాలతో తోరణం ఏర్పాటు చేసి కటిక చీకటి నాడు కాంతులు నింపుతారు. ఇది దీపావళికి ఒకవైపు ప్రాధాన్యత. శాస్త్రీయ కోణంలో చూసినా దీపావళికి చాలా ప్రాధాన్యత ఉంది. వర్షాకాలం తర్వాత వచ్చే పండుగ దీపావళి. వర్షాల కారణంగా నీళ్లు ఎక్కడ బడితే అక్కడ నిలిచిపోయి.. క్రిమి కీటకాలు బాగా వృద్ధి చెందుతాయి. వాటి వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరుబయట దీపాలు వెలిగించడం వల్ల చాలా కీటకాలు వెలుగుకు ఆకర్షితమై దీపంలో పడి చనిపోతాయి. ఇక దీపావళి నాడు కాల్చే టపాసులు, మతాబులు.. వాటి నుంచి వచ్చే పొగ.. దోమలు మొదలైన వాటిని మట్టుపెడతాయి.


రావణ సంహారమైనా, నరకాసుర వథ అయినా... చెప్పేది ఒక్కటే.... కష్టపడితే తప్ప సంతోషం రాదు అని. రాముడు ఎన్నో వ్యయప్రయాసలోర్చి భీకర యుద్ధం చేస్తే తప్ప దశకంఠుడి సంహారం జరగలేదు. అలాగే శ్రీకృష్ణుడు రథసారధిగా మారి సత్యభామ విల్లు ఎక్కిపెట్టి రోజుల తరబడి యుద్ధం చేస్తే తప్ప నరకాసురుడి వథ సంభవించలేదు. అంటే దేవుళ్లయినా సరే సుఖ సంతోషాలు కలగాలంటే కష్టించాల్సిందే అని చెబుతున్నాయి ఈ దీపావళి పురాణ కథలు. అందుకే దీపావళి పండుగను మనలోని చెడును తొలగించి మంచిని మేల్కొల్పానే ఉద్దేశంతో నిర్వహిస్తారు. కష్టాలను ఎదురొడ్డి విజయాలను సొంతం చేసుకునే దైర్యం అందించాలని వేడుకుంటూ జరుపుకుంటారు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: