హెరాల్డ్ స్మరామీ : తెలుగు తెరపై వెలిగిన పద్మనాభం...
తల్లి శాంతమ్మ. తండ్రి బసవరాజు వెంకటశేషయ్య కడపజిల్లా వేంపల్లెకి సమీపంలోనున్న వీరన్నగట్టుపల్లె గ్రామానికి కరణంగా ఉండేవాడు.ఈయన తాత సుబ్బయ్య కూడా కరణమే. ఈయనకు చిన్నప్పటినుంచి సంగీతమన్నా, పద్యాలన్నా మహా ఇష్టం. మూడవయేటి నుంచి పద్యాలుపాడే ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. ఆ ఊరి టెంటు హాలులో "ద్రౌపదీ వస్త్రాపహరణం", "వందేమాతరం", "సుమంగళి", శోభనావారి "భక్త ప్రహ్లాద" మొదలైన సినిమాలు చూసి వాటిలోని పద్యాలు, పాటలు, హాస్య సన్నివేశాలు, అనుకరిస్తుండేవాడు. నాటకాల మీద రక్తితో సినీరంగంలో ప్రవేశించి అనేక ఢక్కాముక్కీలు తింటూ దాన్నే నమ్ముకుని అంచలంచెలుగా ఎదిగిన వ్యక్తి ఆయన.
మాయాలోకం ఆయన తొలి చిత్రమైనా బాగా దగ్గరైంది మాత్రం 1951లో 'పాతాళ భైరవి'లోని పాత్రతోనే. 'సాహసము సేయరా డింభకా రాజకుమారి లభిస్తుంది' అంటూ ఎస్వీఆర్ నేపాల మాంత్రికుడి డైలాగులతో వూపేస్తుంటే సదాజపుడుగా పద్మనాభం 'మోసం గురూ' అంటూ దర్శనమిస్తాడు. 1932లో పుట్టి కన్నాంబ నాగభూషణం దంపతుల సహాయంతో రంగప్రవేశం చేసిన పద్మనాభం ఆ తర్వాతే పరిశ్రమ దృష్టిలో పడ్డాడు. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్కు దగ్గరయ్యాడు. విజయా వారి కళాఖండం 'షావుకారు'(1949)లో మొద్దబ్బాయి పాత్రలో(ఆహార్యం దాదాపు అరగుండు బ్రహ్మానందం తరహాలో వుంటుంది) మెప్పించి తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు.మారిన కాలంతో పాటు మారిన పద్ధతులు, వయోభారం వల్ల పద్మనాభం చాలా కాలంగా పరిశ్రమకు దూరంగా వుండిపోయారు. 'టాటా బిర్లా మధ్యలో లైలా' ఆయన ఆఖరి చిత్రం. అడపా దడపా తన జ్ఞాపకాలు చెబుతూ కాలం గడిపి చివరికి నవ్వులే మిగిల్చి వెళ్లిపోయారు. ఫిబ్రవరి 20, 2010 ఉదయం గుండెపోటుతోఆయన మృతి చెందాడు.