యాత్రాజకీయం: కాళ్లనెప్పులు ఎవరికో..! అధికారం ఎవరికో..?

Chakravarthi Kalyan
అధికారం కోసం.. రాజకీయ నాయకులు వేయని ఎత్తులు.. వాడని జిత్తులు ఉండవు. అయితే ఇప్పుడు తెలంగాణలో రాజకీయం ఉన్నట్టుండి ఊపందుకుంది. కొన్ని నెలల వరకూ టీఆర్‌ఎస్‌దే పెత్తనమంతా.. కాంగ్రెస్ ఉన్నా.. లేనట్టుగా ఉండేది.. బీజేపీ కూడా అంతే.. కానీ ఇప్పుడు రేవంత్ నాయకత్వంతో కాస్త జోరుగా ఉంది కాంగ్రెస్.. బీజేపీ కూడా దుబ్బాక, జీహెచ్‌ఎంసీ జోష్‌ కాస్త తగ్గినా.. ఊపు మీదనే ఉంది. దీనికి తోడు కొత్తగా షర్మిల పార్టీ కూడా హడావిడి చేస్తోంది.

రాజకీయాల్లో కొన్ని సక్సస్ సూత్రాలుంటాయి. అలాంటి వాటిలో పాదయాత్ర ఒకటి. గతంలో వైఎస్‌ను అధికారంలోకి తెచ్చింది ఇదే. ఆ తరవాత చంద్రబాబు, జగన్ కూడా ఈ ఫార్ములాను నమ్ముకుని హిట్ కొట్టారు. ఇప్పుడు తెలంగాణ నాయకులు కూడా ఇదే ఫార్ములాను నమ్ముకుంటున్నారు. ఒక్కొక్కరుగా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే బీజేపీ నాయకుడు బండి సంజయ్ పాదయాత్ర ఖరారైపోయింది. ఇక హుజూరాబాద్‌లోనూ అదే పార్టీ నాయకుడు ఈటల రాజేందర్‌ కూడా పాదయాత్ర ప్రారంభించాడు.

ఇప్పుడు కొత్తగా పీసీసీ పీఠాలు అందుకున్న రేవంత్ రెడ్డి కూడా పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నాడు... ఇక కొత్తగా పార్టీ పెట్టిన షర్మిలమ్మ కూడా పాదయాత్ర చేస్తానంటోంది. తండ్రి సెంటిమెంటుతో చేవెళ్ల నుంచే యాత్ర మొదలు పెడతానంటోంది. ఇలా ఒకరా.. ఇద్దరా.. ఇప్పుడు తెలంగాణ నాయకుల్లో పాదయాత్ర జోష్ కనిపిస్తోంది. వీరే కాదు.. ఇంకా పార్టీ పెట్టకపోయినా స్వతంత్ర్యంగానే సత్తా చాటుతున్న తీన్మార్ మల్లన్న కూడా తెలంగాణ అంతటా పాదయాత్ర చేస్తానంటున్నాడు.

బండి సంజయ్, రేవంత్ రెడ్డి, వైఎస్ షర్మిల, తీన్మార్‌ మల్లన్న..ఇదీ ఇప్పటి వరకూ పాదయాత్రలు చేయదలచుకున్న నాయకుల జాబితా.. ఈటల ఇందుకు అదనం. మరి వీరిలో ఎవరి పాదయాత్ర అధికారం అందిస్తుందో.. ఏ నేతకు విజయం దక్కుతుందో చూడాలి. వీరిలో విజేత ఒక్కరే అవుతారు. మిగిలిన నేతలందరికీ అధికారం సంగతేమో కానీ.. పాదయాత్ర పేరుతో కాళ్ల నొప్పులు మాత్రం తప్పవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: