* మూడో వన్డేలో నెగ్గిన శ్రీలంక
* 2-1తో సిరీస్ కైవసం చేసుకున్న భారత్
మూడు వన్డేల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకున్న టీమిండియా ఆఖరి వన్డేలో ప్రయోగాలకు తెరతీసింది. భారత్ నుంచి సంజూ శాంసన్, రాహుల్ చాహర్, నితీశ్ రాణా, కృష్ణప్ప గౌతమ్, సకారియా వన్డే అరంగేట్రం చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. అయితే, కుర్రాళ్లు తమకు లభించిన బంగారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం విఫలమవడంతో ఆతిథ్య శ్రీలంకకు ఓదార్పు విజయం దక్కింది. శుక్రవారం ముగిసిన నామమాత్రమైన ఆఖరి వన్డేలో ఆల్రౌండ్ షో కనబరిచిన లంకేయులు మూడు వికెట్ల తేడాతో టీమిండియాపై విజయదుందుభి మోగించింది.
ఈ ఏడాది ఆడిన వన్డేల్లో లంకకిది కేవలం రెండో విజయం కావడం కొసమెరుపు. లంక ఊరట విజయాన్ని అందుకున్న సిరీస్ మాత్రం 2-1తో ధవన్ సేన దక్కించుకుంది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్కు దిగిన టీమిండియా 43.1 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది. పృథ్వీ షా (49), సంజూ శాంసన (46) బంతికో పరుగు చొప్పున బాదారు. దీంతో రెండో వికెట్కు 74 పరుగులు జత చేరాయి. ఒక దశలో 157/3తో పటిష్ఠంగానే కనిపించినా.. స్పిన్నర్లు అఖిల ధనంజయ (3/44), జయవిక్రమ (3/59) ధాటికి మిడిలార్డర్ కుప్పకూలింది. ఈ దశలో సూర్యకుమార్ యాదవ్(40) ఆదుకోవడంతో భారత్ ఆ మాత్రమైన స్కోరు చేయగలిగింది. ఛేదనలో లంక 39 ఓవర్లలో 7 వికెట్లకు 227 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ అవిష్క ఫెర్నాండో (76), రాజపక్స (65) రెండో వికెట్కు 109 పరుగుల భారీ భాగస్వామ్యంతో విజయానికి బాటలు వేశారు. రాహుల్ చాహర్కు మూడు వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా ఫెర్నాండో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ సూర్యకుమార్ యాదవ్ నిలిచారు. వన్డే సిరీస్ ఇంతటితో ముగియగా మూడు టీ20ల సిరీస్ ఆదివారం ప్రారంభమవనుంది.