ఇండోర్ వేదికగా జరిగిన రెండో టీ 20 లో శ్రీలంక పై భారత్ 7వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక.. భారత బౌలర్లు చెలరేగడం తో నిర్ణీత 20ఓవర్ల లో 9వికెట్ల నష్టానికి 142పరుగులు మాత్రమే చేయగలిగింది. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తున్నా భారత బౌలర్లను ఎదుర్కోవడం లో లంక బ్యాట్స్ ఘోరంగా తడబడ్డారు. ఆజట్టులో కుశాల్ పెరెరా ఒక్కడే 34పరుగుల తో పర్వాలేదనిపించాడు. ఇక చివరి ఓవర్ లో హసరంగా చివరి మూడు బంతులను బౌండరీలకు తరలించడం తో లంక ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. భారత బౌలర్ల లో శార్దూల్ ఠాకూర్ 3, సైని 2, కుల్దీప్ 2 వికెట్లు పడగొట్టగా సుందర్ , బుమ్రా తలో వికెట్ తీశారు.
అనంతరం స్వల్ప లక్ష్యం తో బరిలోకి దిగిన భారత్ కు ఓపెనర్లు అదిరిపోయే శుభారంభాన్ని ఇచ్చారు. రాహుల్(45) తన సూపర్ ఫామ్ ను కొనసాగిస్తూ దూకుడుగా అడగా శిఖర్ ధావన్(32) మాత్రం సంయమనం పాటించాడు. వీరిద్దరూ జోరు తో 5ఓవర్లకే భారత్ స్కోర్ 50 దాటింది. అయితే ఆతరువాత స్కోర్ నెమ్మదించింది. ఈదశలో హాఫ్ సెంచరీ కి చేరువగా వచ్చిన రాహుల్ భారీ షాట్ ఆడబోయి క్లీన్ బోల్డ్ అయ్యాడు. ఆతరువాత కాసేపటికే ధావన్ కూడా వెనుదిరగగా శ్రేయాస్ అయ్యర్(34) కెప్టెన్ కోహ్లీ(30) లంక బౌలర్లను ఆడుకున్నారు. అయితే విజయానికి చేరువలో ఉండగా శ్రేయాస్ అవుట్ అయినా అప్పటికే భారత్ విజయం ఖాయమైంది. 17.3ఓవర్ల లో కోహ్లీ సిక్స్ తో విజయాన్ని అందించాడు. కాగా సైని కి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ లభించింది. ఇక ఈవిజయం తో భారత్ మూడు మ్యాచ్ ల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో కి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య చివరి టీ 20 ఈనెల 10న జరుగనుంది.