మంచిమాట: ఆశించకుండా పనులు చేస్తూ.. విజయం మీదే అవుతుంది..!

Divya
రంగాపురం అనే ఊర్లో గోపయ్య అనే పేదవాడు ఉండేవాడు. ఎవరు ఏ పని చెప్పినా చేసి పెట్టినా వాళ్లు ఇచ్చే డబ్బులు తీసుకొనేవాడు. ఏ పనైనా చాలా శ్రద్ధగా,నిజాయితీగా చేస్తాడని అతనికి పేరు. ఓసారి గోపయ్యను ఆ ఊరి జమీందారు పిలిచి తన దగ్గరున్న పడవకు రంగులు వేయమని, అందుకు 50 రూపాయలు ఇస్తాననీ చెప్పాడు.

గోపయ్యకు ఆ డబ్బు తక్కువని తెలిసినా ..ఆ పని పూర్తి చేయటానికి సిద్ధమై... జమీందారు ఇచ్చిన రంగులన్నీ తీసుకొని పడవ దగ్గరకు వెళ్లాడు.రంగులు వేసేందుకు పడవలోకి ఎక్కితే దాని మధ్యలో ఒక రంధ్రం కనిపించింది. దాన్ని పూడ్చకుండా రంగులేయటం వల్ల ఉపయోగం లేదనుకున్న గోపయ్య .. ముందు దాన్ని పూడ్చేందుకు ప్రయత్నించాడు. సాయంత్రానికి పని పూర్తి అయ్యింది. జమీందారు మర్నాడు వస్తే డబ్బులిస్తానని చెప్పి గోపయ్యను పంపించేశాడు. మర్నాడు జమీందారు కుటుంబ సభ్యులంతా ఆ పడవ ఎక్కి ఊరవతలకు వెళ్లారు.
అదేరోజు ఊరు నుంచి తిరిగొచ్చిన జమీందారు..నౌకరికి ఈ విషయం తెలిసి కంగారు పడుతూ.. జమీందారు దగ్గరకు వెళ్లి... ఆ పడవకు ఉన్న రంద్రం గురించి చెప్పాడు. దాంతో జమీందారు కంగారుతో అప్పటికప్పుడు నది ఒడ్డుకు వెళ్తే, కాసేపటికి కుటుంబసభ్యులంతా పడవలో తిరిగి రావటం కనిపించింది. వాళ్లు ఒడ్డుకు చేరుకున్నాక పడవను గమనిస్తే ఎక్కడ రంధ్రం కనిపించలేదు. విషయం అర్థమైన జమీందారు అప్పటికప్పుడు గోపయ్యను ఇంటికి పిలిచి... చెప్పిన దానికన్నా ఎక్కువడబ్బులు ఇస్తూ 'రంగులేయమని చెబితే... రంధ్రాన్ని కూడా పుడ్చావూ. మీ మేలు మర్చిపోలేను. నీ వల్లే ఈ రోజున నా ఇంట్లో వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు.' అని ప్రశంసించాడు. అలా గోపయ్య మంచితనం చూసి ఊర్లోవాళ్లంతా మరోసారి తెలుసుకొని అతడిని అభినందించారు.

గోపయ్య లాగే ప్రతి ఒక్కరు కూడా దేనినీ కూడా ఆశించకుండా పని చేస్తేనే.. జీవితంలో ఆశించని ఫలితాలను అందుకోవచ్చు. కాబట్టి ప్రతిఒక్కరూ  ఫలితం  ఆశించకుండా చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: