వైసీపీ అధినేత వైఎస్.జగన్ ఈ నెల 30న ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తన ప్రమాణస్వీకార విషయంపై గవర్నర్ను కలిసి తమ పార్టీ ఎమ్మెల్యేల జాబితాను అందజేసిన గవర్నర్ విజయవాడలో నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇక జగన్ కేబినెట్లో ఎవరెవరు ? ఉంటారన్నదే ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. జగన్ కేబినెట్లో గరిష్టంగా ఆయన కాకుండా 25 మందికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది.
కానీ వైసీపీ నుంచి ఏకంగా 151 మంది గెలవడంతో పాటు మంత్రి పదవి రేసులో ఉన్న సీనియర్లు, త్యాగాలు చేసిన వారందరూ విజయం సాధించారు. వైసీపీ గెలిచిన సీట్ల సంఖ్య చాలా ఎక్కువుగా ఉండడంతో సహజంగానే మంత్రి పదవులు ఆశించే వారు కూడా ఎక్కువే ఉన్నారు. గతంలో 2012లో జగన్ పార్టీ పెట్టినప్పుడు ఏకంగా 16 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్లి రిస్క్ చేసీ మరి విజయం సాధించారు. వీరిలో ఇప్పుడు చాలా మంది మూడు, నాలుగు సార్లు కూడా గెలిచారు. వీరంతా ఇప్పుడు మంత్రి పదవులు ఆశిస్తున్నారు.
అలాగే 2012 ఉప ఎన్నికల్లో ఓడిన ముదునూరు ప్రసాదరాజుతో పాటు పిల్లి బోస్ కూడా ఇప్పుడు కేబినెట్ రేసులో ప్రముఖంగానే ఉన్నారు. ఇక ధర్మాన, బొత్స, పెద్దిరెడ్డి లాంటి వాళ్లకు మంత్రులుగా చేసిన అనుభవం ఉంది. ఇప్పుడు వీరికి కూడా మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంది. ఇక గత ఎన్నికలకు ముందు పార్టీ మారి మంత్రి పదవిపై హామీలు పొందిన నేతలు కూడా రేసులో ఉన్నారు. ఇక జగన్ హామీ ఇచ్చిన ఆళ్ల రామకృష్ణారెడ్డి, మర్రి రాజశేఖర్, బాలినేని శ్రీనివాస్రెడ్డితో పాటు విశాఖ జిల్లాలో గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్లు (జగన్ ఇన్నర్గా హామీ ఇచ్చినట్టు టాక్) ఉన్నారు.
వీరి లెక్కలు ఎలా ఉన్నా ఈ నెల 9న మాత్రం జగన్ తనతో పాటు 9మంది మంత్రులను మాత్రమే కేబినెట్లోకి తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. వీరిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, కొడాలి నాని, పాముల పుష్పశ్రీ వాణి, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, గ్రంధి శ్రీనివాస్, పిల్లి బోస్, అవంతి శ్రీనివాస్ పేర్లు వైసీపీ వర్గాల్లో ఇన్నర్గా వినిపిస్తున్నాయి. ఇక ఈ వేడి తగ్గక ముందే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి.. ఆయా జిల్లాల్లో సత్తా చాటిన నేతలను కూడా మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న ఆలోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది.