చంద్రబాబు మీరే కరెక్ట్ అయితే ఆ పని ఎందుకు చేయడం లేదు ..?
చంద్రబాబు .. ఇప్పుడు అధికారుల మీద గగ్గోలు పెట్టడం విడ్డురంగా ఉంది. ఇప్పుడు చంద్రబాబు కేవలం ఆపద్ధర్మ సీఎం మాత్రమే. 'నేను క్యాబినెట్ మీటింగ్ పెడతా.. అధికారులు ఎందుకు సహకరించరో చూస్తా.. రూల్స్కి వ్యతిరేకంగా వెళితే కఠిన చర్యలు తప్పవు..' అని హెచ్చరిస్తున్నారు. ముందస్తు సర్వేల ఫలితాల్ని చూస్తే, ఇంకో ఇరవై రోజులు కూడా పూర్తిగా చంద్రబాబు అధికారంలో వుండే పరిస్థితి లేదు.
అధికారుల పరిస్థితి అలా కాదు. ఉద్యోగంలో చేరిన తొలిరోజు నుంచీ, ఉద్యోగ విరమణ వరకూ వివిధ ప్రభుత్వాల కింద పనిచేయాల్సి వస్తుంది. ఆ లెక్కన అధికారులే శాశ్వతం. రాజకీయ నాయకులు కానే కాదు. అధికారం ఇప్పుడు మారితే, ఉద్యోగులు ఇంకో పార్టీ ఏర్పాటు చేసే ప్రభుత్వంలో పనిచేస్తారు. ఈ విషయం సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న చంద్రబాబుకి తెలియకపోతే ఎలా.?
నిజానికి ఇది చంద్రబాబుకి ఎంతో ప్రత్యేకమైన సమయం. హుందాతనంతో కూడిన రాజకీయాలు చేయాల్సిన చంద్రబాబు, తన స్థాయిని మర్చిపోతున్నారు. చిన్న పిల్లాడు 'నాకు చాక్లెట్ ఇవ్వలేదు' అని మారాం చేసినట్లు, అధికారులు తనకు రిపోర్ట్ చేయడంలేదనీ, సీఎస్ తనను గౌరవించడంలేదనీ నెత్తీనోరూ బాదుకుంటున్నారు. చంద్రబాబు చెబుతున్నవన్నీ నిజాలే అయితే, ఆయన ఎంచక్కా న్యాయస్థానాల్ని ఆశ్రయించొచ్చు. ఆ పని ఆయన చేయడంలేదంటే, జస్ట్ 'మేనేజ్' చేయాలని ఆయన అనుకుంటున్నట్లే లెక్క.