సోదరులకు శుభాలను సోదరీమణులకు రక్షణను పంచే రాఖీ పండగ

రక్షా బందన్ భారతీయ సాంప్రదాయంలో సోదరీ సోదర భావాన్ని అనుబంధాన్ని అంతర్లీనంగా ఇమిడిపోయి సృజించే ఒక సాంప్రదాయ పండుగ. అనుబంధాలకు ఆత్మీయతలకేకాదు సోదరీమణులకే కాదు ఆభావనతో చరించే అందరికి వర్తించే సాంస్కృతిక సాంప్రదాయ ఔన్నత్యమిది. 


చరిత్రలో ఉత్తర, పశ్చిమ భారతానికే పరిమితమై వైభవంగా జరుపుకునే ఈ పండుగను ఇప్పుడు దేశమంతా జరుపుకుంటున్నారు. స్వంత అన్నకుగాని తమ్మునికిగాని ఆభావనతో మెలిగే సోదర సమానంగా భావించే వారికి అనురాగ సూచనగా సోదరి కట్టే నూలుదార నిర్మితమైన పట్టీని కట్టటాన్ని "రాఖీ లేదా రక్షాబంధన్" ఇదే ఈ పండుగ ప్రధాన విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ. 


తన సోదరి సుఖసంతోషాలకు అన్నయ ఇచ్చే భరోసాయే రాఖీ ఒక రకమైన ప్రమాణం. అంతేకాదు రాఖీ కట్తిన సోదరి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్య కుడిచేతి మణికట్టు వద్ద కట్టే నూలుదారాల పట్తెనే ఈ రాఖీ. అది చాలా ఉత్సాహంతో జరుపుకుం‌టూరు. 


ఇక భారతీయ ఇతిహాసాలు & చరిత్ర చెప్పే కథనాలను పరిశీలిద్ధాం. 


రక్షాబంధన్‌ ఆచారం మన దేశంలో ప్రాచీనకాలం నుంచే ఉంది.  పురుషులు యుద్ధాలకు బయలుదేరే సమయంలో వారి విజయం కోసం మహిళలు పూజలు నిర్వహించే వారు.  పూజల తర్వాత ఆ దేవతల వద్ద సేకరించిన పవిత్ర కుంకుమతో పురుషుల నుదుట వీరతిలకం దిద్ది, వారి ముంజేతికి నూలుదారాలతో అల్లిన సన్నని వెడల్పాటి పట్టీని రక్షాబంధనంగా ధరింపజేసే వారు. 

ఇతిహాసకాలం ప్రకారం చూస్తే పాండవ పత్ని ద్రౌపది, శ్రీకృష్ణుడి కి మద్య అన్నాచెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా పెనవేసుకుంది. శిశుపాలుడిని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తంధారగా కారుతుంది అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలికి కట్టుకట్టిందట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళ లా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి ప్రమాణం తో కూడిన బధ్రతను హామీగా ఇస్తాడు. అందుకు ప్రతిగా ద్రౌపది పై నిండు కురు సభలో దుశ్శాసనుడి దురాగతం నుండి ఆమెను కాపాడుతాడు.

బలి చక్రవర్తి స్వర్గంపై దండెత్తి, ఇంద్రుడిని ఓడించి స్వర్గాన్ని కైవసం చేసుకున్నాడు. స్వర్గం రాక్షస రాజ్యంగా మారింది. పదవీచ్యుతుడైన తన భర్తకు విజయం దక్కేట్లు చూడాల్సిందిగా శచీదేవి విష్ణువును కోరింది. విష్ణువు ఆమెకు నూలుదారాలతో అల్లిన తాడును ఇచ్చాడు. "ఈసారి యుద్ధానికి వెళ్లే ముందు నీ భర్త ముంజేతికి ఈ రక్షాబంధనాన్ని కట్టు. తప్పక విజయం సాధించగలడు" అని చెబుతాడు. బలి చక్రవర్తిపై తిరిగి యుద్ధానికి సిద్ధపడిన ఇంద్రుడికి శచీదేవి విష్ణువు ఇచ్చిన రక్షాబంధనాన్ని కడుతుంది. ఇంద్రుడు బలిచక్రవర్తిని ఓడించి, తిరిగి స్వర్గాధిపత్యం సాధిస్తాడు. ఇది భవిష్యపురాణంలోని గాథ.

వామనావతారంలో వచ్చిన విష్ణువు బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేసిన కథ తెలిసిందే కదా! మహాభక్తుడైన బలిచక్రవర్తి ఆ సమయంలో విష్ణువును నిత్యం తన వద్దనే ఉండాలంటూ కోరుకుంటాడు. బలి కోరిక మేరకు విష్ణువు పాతాళంలోనే ఉండిపోతాడు. లక్ష్మీదేవి వైకుంఠంలో ఒంటరిగా మిగిలిపోతుంది. తన భర్తను తిరిగి తనతో తీసుకుపోవడానికి లక్ష్మీదేవి స్వయంగా వచ్చి బలి చక్రవర్తికి రక్షాబంధనం కడుతుంది. కానుకగా ఏం కావాలని బలి అడిగినప్పుడు తన భర్తను తనతో పాటే వైకుంఠానికి పంపమని కోరుతుంది. బలి సరేననడంతో పతీసమేతంగా లక్ష్మీదేవి వైకుంఠానికి చేరుకుంటుంది. ఈ గాథ భాగవతంలోను, విష్ణుపురాణంలోను ఉంది.

ఆయువు తీరినవారి ప్రాణాలను హరించడంలోను, నరకానికి వచ్చిన పాపుల పాప విచారణ చేసి, వారికి శిక్షలు విధించడంలోను నిరంతరం తలమునకలుగా ఉండే యమధర్మరాజు ఒకసారి పన్నెండేళ్ల పాటు తన చెల్లెలు యమునను చూడటానికి వెళ్లలేకపోయాడు. అన్నను చూసి ఏళ్లు గడుస్తున్న కొద్దీ యమున దిగులుతో కుంగిపోసాగింది. గంగ వద్ద ఒకసారి ఆమె తన గోడు వెళ్లబోసుకుంది. అప్పుడు గంగ యముడి వద్దకు వెళ్లి యమున బాధను వివరిస్తుంది. అప్పుడు యముడు నరకాన్ని వీడి బయలుదేరి యమున వద్దకు వస్తాడు. ఇంటికి వచ్చిన అన్నకు యమున షడ్రసోపేతమైన భోజనం వడ్డించి, రక్షాబంధనాన్ని కడుతుంది. కనీసం ఏడాదికి ఒకసారైనా తనను చూడటానికి రావాలని కోరుకుంటుంది.


అలెగ్జాండర్‌ భార్య రుక్సానా కేకయ రాజు పురుషోత్తముడికి, చిత్తోడ్‌ రాణి కర్ణీ దేవి మొఘల్‌ చక్రవర్తి హుమాయూన్‌కు రక్షాబంధనాలను పంపి, వారి సాయం కోరినట్లుగా చారిత్రక గాథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే, వీటికి స్పష్టమైన ఆధారాలు ఎక్కడా లేవు.

శ్రీ మహావిష్ణువు విజయ స్రవంతిలో హయగ్రీవావతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెబుతారు. పూర్వం ఓసారి హయగ్రీవుడు అనే రాక్షసుడు మహాశక్తిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన మహాశక్తిని వరం కోరుకొమ్మన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు. అయితే అది ఆమె సాధ్యపడదని చెప్పినప్పుడు "హయగ్రీవం లేదా గుర్రపు తల" ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు. ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతర్థానమైంది. 

ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతుండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది. చివరకు శివుడు ఉపాయాన్ని పన్నాడు. శ్రీ మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగిన వానిలా ఆ ధనుస్సు అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. ఆయనను నిద్రలేపటానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు. అయితే ఆ దేవతలంతా ఆలోచించి "వమ్రి" అనే ఓ కీటకాన్ని పంపి ధనుస్సుకున్న అల్లెతాడును కొరకమని చెప్పారు. 

అలా చేస్తే తాడు వదులై విల్లు కదలి విష్ణువుకు మెలకువ వస్తుందన్నది వారి ఆలోచన. అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎగిరి వెళ్ళింది. దేవతలు అంతటా వెదికారు కానీ ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు వెంటనే మహాశక్తిని గురించి తపస్సు చేశాడు. అప్పుడామె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు. 

ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ. ఆ తర్వాత హయగ్రీవుడుగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయించాడు. మహాశక్తి మహిమను, శ్రీ మహావిష్ణుతత్వాన్ని ఈ కథ తెలియచెప్తుంది. అందుకే శ్రావణ పూర్ణిమనాడు హయగ్రీవజయంతి కూడా జరపడం కనిపిస్తుంది. అంతర్లీనంగా శ్రీ మహా విష్నువు తను సోదరిగా భావించే మహాశక్తికి ఆమె వరం ఈ విధంగా సర్వ జనావళికి శాపంగా మారకుండా చూడటమే ఈ ఇతిహాస వృత్తాంతం. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: