త్వరలో చేయాలనుకుంటున్న మంత్రివర్గ విస్తరణలో ఫిరాయింపు ఎంఎల్ఏలకు చంద్రబాబునాయుడు పెద్ద షాకే ఇవ్వనున్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణ అన్నది ప్రధానంగా ఎస్టీ, ముస్లిం వర్గాలను దృష్టిలో పెట్టుకుని చేయాలన్నది చంద్రబాబు ఉద్దేశ్యంగా కనబడుతోంది. ఎందుకంటే, మంత్రివర్గంలో పై రెండు సామాజికవర్గాలకు ఇప్పటి వరకూ చోటు దక్కని విషయం అందరికీ తెలిసిందే.
షరీఫ్ కే చోటా ?
పరిస్ధితులన్నీ అనుకూలిస్తే ఈనెల 28వ తేదీ తర్వాత ఎప్పుడైనా మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం జరుగుతోంది. నిజంగానే విస్తరణ జరిగితే ముస్లిం ఎఎల్సీ ఎంఏ షరీఫ్ కు చోటు దక్కుతుందని కూడా ప్రచారంలో ఉంది. షరీఫే ఎందుకంటే, షరీఫ్ కు చంద్రబాబు తప్ప దిక్కులేదు. ఈ ఎంఎల్సీ భవిష్యత్తంతా చంద్రబాబుపైనే ఆధారపడుంది. పార్టీలో పెద్దగా పదవేదీ ఇవ్వకపోయినా గడచిన 30 ఏళ్ళుగా చంద్రబాబునే నమ్ముకుని బ్రతికేస్తున్నారు. కాబట్టి షరీఫ్ పైనే చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో మైనారిటీల ఓట్లు కొల్లగొట్టేందుకు చంద్రబాబు ఇపుడు మైనారిటీలపై అపార ప్రేమ కనబరుస్తున్నారు లేండి.
ఫిరాయింపులకు టిక్కెట్లిస్తారా ?
షరీఫ్ కు చోటు విషయమే నిజమైతే అదే పనిగా వైసిపిలో నుండి టిడిపిలోకి ఫిరాయించిన జలీల్ ఖాన్, అత్తార్ చాంద్ భాష పరిస్ధితేంటి ? వీరిద్దరినీ టిడిపిలోకి లాక్కునేటపుడు మంత్రి పదవులు ఆశ చూపే లాక్కున్నారట. అయితే, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో వారిద్దరినీ చంద్రబాబు దూరం పెట్టేశారు. ఏదో తప్పదు కాబట్టి జలీల్ కు ఓ కార్పొరేషన్ అప్పగించారు. అంటే మంత్రివర్గంలో చోటు ఇచ్చే ఉద్దేశ్యం లేదని తేలిపోతోంది. బహుశా ఇద్దరు ఫిరాయింపు ఎంఎల్ఏలకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్లు ఇవ్వకపోయినా ఆశ్చర్యం లేదు. అందుకే మంత్రిపదవులు దండగన్నట్లుగా ప్రచారం ఊపందుకుంది.