నంద్యాల ఉప ఎన్నిక.. 2019కి సెమీ ఫైనల్గా భావిస్తున్నారంటే టీడీపీకి ఇది ఎంత కీలకమో ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. అందుకే సీఎం చంద్రబాబు ఈ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 25 మంది ఎమ్మెల్యేలను, అందరు మంత్రులను అక్కడే మోహరించేశారు. మరి వీరంతా ప్రచారంలో తలమునకలై ఉంటే.. టీడీపీ యువనేత, సీఎం తనయుడు, మంత్రి లోకేశ్.. ప్రచారానికి రాకపోవడంపై పార్టీ శ్రేణుల్లో అనుమానాలు రేకెత్తించేలా చేస్తోంది. నోటిఫికేషన్కు ముందు ప్రచారం చేసినా.. కీలక దశలో రాకపోవడంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రచారం చేశాక.. ఫలితం సరిగ్గా రాకపోతే అది తనకు మైనస్గా మారుతుందనే లోకేశ్ కనిపించడం లేదని తెలుస్తోంది.
నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం ఆఖరు దశకు చేరుకుంటోంది. హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ కూడా ప్రచారంలో ఓ చెయ్యి వేశాడు. వైసీపీకి కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం కూడా చేశాడు. ఇక్కడ ఎలాగైనా గెలిచి, ప్రభుత్వంపై పైచేయి సాధించాలని పట్టుదలతో ఉన్న జగన్.. ఏకంగా వారం రోజుల నుంచి నంద్యాలలోనే మకాం వేశారు. మరి టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు మాత్రం ఢిల్లీలో కేంద్రమంత్రులతో భేటీ అవుతున్నారు.
మొత్తం వ్యవహారమంతా చంద్రబాబుపైనే వేసి.. ఈ ఎన్నికలు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మాత్రం లోకేశ్ నంద్యాల ప్రచారానికి రాకపోవడంపై పార్టీలోనూ పెద్దయెత్తున చర్చ జరుగుతోంది. లోకేష్ నంద్యాల పర్యటన తర్వాతే శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఉప ఎన్నికలో విజయం సాధించాలంటే అందరూ సమష్టిగా కృషి చేయాలని చంద్రబాబు పదేపదే చెబుతున్నా.. లోకేష్ మాత్రం దూరంగా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. లోకేశ్ గైర్హాజరీపై టీడీపీ శ్రేణుల్లోనూ అయోమయం నెలకొంది.
నంద్యాలలో ఫలితంపై అనుమానం ఉండటం వల్లనే లోకేశ్ రావడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే మరికొందరు మాత్రం దీనికికారణాలు లేకపోలేదంటూ సర్దిచెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీ పర్యటనతో పాటు కొన్ని కీలక బాధ్యతలపై దృష్టి పెట్టడం వల్లే ఆయన రాలేదని కవర్ చేస్తున్నాయి. అయితే వీటన్నింటి వెనుక ఉన్న రీజన్ ఏంటంటే.. సెమీ ఫైనల్గా భావిస్తున్న ఈ కీలకమైన పోరులోకి వెళ్లి ప్రచారం చేపడితే.. ఫలితాలు ఒకవేళ అనుకూలంగా రాకపోతే ఆ మచ్చ తన భవిష్యత్ రాజకీయాలపై పడుతుందని, ఇది తనకు డేంజర్ అని లోకేశ్ వెనకడుగు వేశారని పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
నంద్యాలలో రెడ్డి సామాజిక వర్గం ఓటర్లే ఎక్కువగా ఉండటంతో లోకేష్ వచ్చినా ప్రయోజనం ఉండదని భావించిన చంద్రబాబు.. లోకేష్ ను నంద్యాల పర్యటన పెట్టుకోవద్దని సూచించినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరి మొత్తానికి టీడీపీ అధినేత లోకేష్ను నంద్యాల ట్రాక్ నుంచి తెలివిగా తప్పించారని గుసగుసలు వినిపిస్తున్నాయి.