ప్రియుడి తో కలిసి భర్త ను హత్య చేసిన భార్య
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఓ మహిళ . వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంజాపూర్ గ్రామంలో నివసించే ప్రసాద్ బాబు , సరోజ దంపతులు. వీరు నల్లగొండ జిల్లా నుంచి జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చారు. ప్రసాద్ ఆటో డ్రైవర్ గా పని చేస్తుండగా సరోజా వెలుగు ప్రాజెక్ట్ బుక్ కీపర్ గా పనిచేసేది. దీనికితోడు ప్రసాద్ చిట్టీల వ్యాపారం నిర్వహించేవారు ... వ్యాపారంలో నష్టాలు రావడంతో అప్పుల పాలయ్యాడు .
అప్పులు ఇచ్చిన వారు తరచూ ఇంటికి వచ్చి అప్పు తీర్చమని ఒత్తిడి తీసుకువస్తుండడం తో ప్రసాద్ స్నేహితుల వద్ద తల దాచుకుంటూ రోజుల తరబడి ఇంటికి రాకుండా ఉండేవాడు . ఈ నేపథ్యంలో ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తున్న నర్సింహా తో పరిచయం ఏర్పడింది . ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది . ఈ విషయం తెలిసిన ప్రసాద్ బాబు గత కొద్ది రోజులుగా సరోజ ను తీవ్రంగా హింసిస్తున్నాడు . ఈ విషయాన్ని తన ప్రియుడు నర్సింహకు చెప్పి పథకం ప్రకారం భర్త ను హత్య చేయాలని నిర్ణయించుకుంది .
ఈ నెల 6న నర్సింహా తన బందువు అయిన రామకృష్ణ కు విషయం చెప్పి అతనిని ప్రసాద్ ఇంటికి తీసుకువచ్చాడు. ప్రసాద్ కు వారిద్దర్నీ సరోజ పరిచయం చేసి ... ఫైనాన్స్ ఇవ్వడానికి వచ్చినట్లు తెలిపింది . దాంతో అందరు కలిసి మద్యం తాగారు . అనంతరం ముగ్గురు కలిసి పథకం ప్రకారం ప్రసాద్ హత్య చేశారు. అనంతరం నర్సింహా, రామకృష్ణ అక్కడినుంచి వెళ్లిపోయారు. ఏడోవ తేదీ ఉదయాన్నే తన భర్త గుండెపోటుతో మృతి చెందాడని సరోజ తన సోదరుడు లక్ష్మణ్ తో పాటు బంధువులకు సమాచారం అందించింది .
అందరు కలిసి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. అయితే ప్రసాద్ మెడ పై దెబ్బలు ఉండడం గమనించి అతని బంధువులు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కు తరలించడం తో అసలు విషయం బయటపడింది. సరోజ అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించింది. దీంతో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.