జనసేన అధ్యక్షుడు సినీ నటుడు పవన్ కళ్యాణ్ నెక్ట్స్ దారి ఏంటి? తాను పల్లకీ మోయడానికి రాలేదని తనను ముఖ్యమంత్రి కాకుండా ఎవరూ అడ్డుకోలేరని పవన్ ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో కార్యకర్తలతో సీఎం.. సీఎం అని పవన్ పిలిపించుకునేవారు. అయితే, ముఖ్యమంత్రిని అవుతానన్న పవన్ పోలింగ్ ముగిసిన తర్వాత సైలెంటవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. మరోవైపు అదే సమయంలో, ఇంకా ఫలితాలు రాకముందే జనసేన తట్టా బుట్టా సర్దేయడం హాట్ టాపిక్ గా మారింది. జనసేన పార్టీ ఆఫీసుల ముందు టులెట్ బోర్డులు వెలిశాయి. అయితే, జనసేన జెండా ఎత్తేయడం గురించి పవన్..కీలక క్లారిటీ ఇచ్చారు.
గత కొద్దికాలంగా పార్టీ కార్యకలాపాలను వేగవంతం చేసిన పవన్ ఇందుకో రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్, విజయవాడలో పలు భవనాలను లీజుకు తీసుకున్నారు. ఎన్నికల సమయం వరకు వాటిలో పెద్ద ఎత్తున్నే కార్యకలపాలు నిర్వహించారు. అయితే, ఇటీవల కార్యాలయాల ముందు టూ-లెట్ బోర్డులు ప్రత్యక్షం కావడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదే సమయంలో...జనసేన జెండా ఎత్తేస్తుందా అనే చర్చ సైతం కొన్ని వర్గాల నుంచి వ్యక్తమైంది. దీనికి పవన్ క్లారిటీ ఇచ్చారు.
నియోజకవర్గాల్లోని జనసేన కార్యాలయాలు యథావిధిగా కొనసాగించాలని పవన్ తెలిపారు. `నియోజకవర్గాలవారీగా పార్టీ కార్యాలయాలు కొనసాగించండి. ఆఫీస్ అంటే పెద్ద పెద్ద హంగులు, ఆర్భాటాలు అవసరం లేదు. కార్యకర్తలు కూర్చోవడానికి వీలుగా ఓ రూమ్, ప్రెస్ మీట్ పెట్టడానికి ప్లేస్ ఉంటే చాలు`` అంటూ ఇచ్చారు. అయితే, నియోజకవర్గాల ఆఫీసుల గురించి చెప్పిన పవన్ రాష్ట్ర స్థాయి కార్యాలయాలను మూసివేయడం గురించి స్పందించలేదేంటో!