
పవన్ కళ్యాణ్ భార్యపై ట్రోల్స్.. రంగంలోకి రాములమ్మ?
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా పైన సోషల్ మీడియాలో దారుణంగా కామెంట్స్ వస్తున్నాయి. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఆమె తలనీలాలు సమర్పించిన తర్వాత... రకరకాలుగా ఆమెను వేధిస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై... కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ విజయశాంతి రంగంలోకి దిగి... ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మహిళను ఇలా వేధించడం ఎంత మేరకు కరెక్ట్ అంటూ నిలదీశారు రాములమ్మ.
తిరుమల శ్రీవారి సన్నిధిలో తలనీలాలు సమర్పించిన పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా పైన జరుగుతున్న ట్రోలింగ్ను తీవ్రంగా ఖండించారు విజయశాంతి. విదేశాల నుంచి వచ్చి... పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన... అన్నా లెజినోవా ఉద్దేశించి కామెంట్స్ చేయడం అలాగే ట్రోలింగ్ చేయడం అత్యంత దారుణమైన చర్య అంటూ నిప్పులు చెరిగారు. తన కుమారుడు అగ్ని ప్రమాదం నుంచి బయటపడినందుకు కృతజ్ఞతగా తిరుమల శ్రీవారికి తలనీలాలు ఇచ్చారని గుర్తు చేశారు. ఇలాంటి నేపథ్యంలో ఆమెకు అండగా నిలవాల్సింది పోయి ట్రోలింగ్ చేయడం చాలా దారుణం అన్నారు.
ఇకనైనా ట్రోలింగ్ ఆపి... ఆమెకు అండగా నిలవాలని కోరారు. దీంతో విజయశాంతి చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా.... గత వారం రోజుల కిందట డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. సింగపూర్ లోని ఓ ప్రముఖ స్కూల్లో చదువుతున్న మార్క్ శంకర్... అగ్ని ప్రమాదానికి గురి కావడం జరిగింది. ఈ ప్రమాదంలో.. శంకర్ కాళ్లు అలాగే చేతులు కాలిపోయాయని చెబుతున్నారు.
ఈ అగ్ని ప్రమాదంలో ఓ చిన్నారి కూడా మృతి చెందాడట. అయితే ఈ సంఘటన తెలియగానే వెంటనే సింగపూర్ పయనమయ్యారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు. సింగపూర్ లోనే మెరుగైన వైద్యం అందించిన తర్వాత... శంకరును ఇటీవల ఇండియాకు తీసుకువచ్చారు. ప్రస్తుతం శంకర్ ఆరోగ్యం కుదుటగా ఉంది. ఇలాంటి నేపథ్యంలోనే మొక్కు తీర్చుకునేందుకు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా . ఈ సందర్భంగా తలనీలాలు కూడా సమర్పించారు.