కుప్పం వైపు క‌న్నెత్తి చూడ‌ని ఆ ఇద్ద‌రు వైసీపీ లీడ‌ర్లు..?

RAMAKRISHNA S.S.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు.. సొంత నియోజకవర్గం కుప్పంలో చేసిన రాజకీయానికి అంతే లేదు. కుప్పంలో ఎలాగైనా చంద్రబాబు పరువు తీయాలి.. చంద్రబాబును ఓడించాలని పెద్దిరెడ్డి విశ్వ ప్రయత్నాలు చేశారు. జగన్ సైతం కుప్పం బాధ్యతలు పెద్దిరెడ్డి చేతుల్లో పెట్టడంతో పెద్దిరెడ్డి ఆడింది ఆట.. పాడింది పాటగా మారింది. పెద్దిరెడ్డికి తోడు వైసీపీ ఎమ్మెల్సీగా కుప్పం వైసీపీ ఇన్చార్జిగా ఉన్న ఇద్దరు కలిసి చాలా అరాచకాలు చేశారు.

కుప్పం మున్సిపల్ పంచాయతీ ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలలో తెలుగుదేశం వారిని ఇష్టమొచ్చినట్టు బెదిరించి వైసీపీ గెలిచేలా చేశారు. ఇక సాధారణ ఎన్నికలలో సైతం చంద్రబాబును ఓడిస్తానని పెద్దిరెడ్డి సవాల్ చేశారు. అయితే ఎన్నికలలో చంద్రబాబు కుప్పంలో 45 వేల ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వారు చేసిన పనులు కారణంగా ఇప్పుడు అటు పెద్దిరెడ్డి తో పాటు.. ఇటు భరత్ కుప్పంలో అడుగుపెట్టలేని పరిస్థితి వచ్చేసింది.

పార్టీ ఓడిపోయిన వెంటనే సగం మంది క్యాడర్ నుంచి పారిపోయారు. సగం మంది టీడీపీకి లొంగిపోయారు. పారిపోయిన వారిలో వైసీపీ ఇన్చార్జిగా ఉన్న భరత్ కూడా ఉన్నారు. హైదరాబాదులో శాశ్వత నివాసం ఉండే భరత్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కుప్పంలో తనదే రాజ్యం.. కుప్పంకి తానే రాజును అన్నట్టుగా చెలరేగిపోయారు. దీనికి తోడు పోలీసులను అడ్డం పెట్టుకుని కుప్పంలో టీడీపీ నేతలను బాగా బెదిరించారు. చంద్రబాబు పర్యటనకు వస్తే రాళ్లు వేశారు. చంద్రబాబు టూర్ కి వస్తే బాంబులు వేస్తానని ప్రకటించారు.

ఇంత చేసిన తర్వాత ఇప్పుడు పార్టీ ఓడిపోవడంతో తమ నియోజకవర్గంలో ఉంటే కష్టం అని నియోజకవర్గాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. విచిత్రం ఏంటంటే పెద్దిరెడ్డి సైతం కుప్పం నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదు. కుప్పం వైసీపీ శ్రేణులకు అండగా ఉండాల్సిన భరత్‌ సైతం కుప్పం వైపు రావడం లేదు. అసలు కుప్పం వైపు చూడటం లేదు. వాళ్ళిద్దరూ లేనప్పుడు ఇక మిగిలిన పార్టీ వాళ్ళ‌లో ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: