దిక్కులేని వైసీపీకి ' దూలం ' గ‌తి అయ్యారా.. !

RAMAKRISHNA S.S.
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సాధారణ ఎన్నికలలో చిత్తుచిత్తుగా ఓడిపోయిన వైసీపీకి.. ఇప్పుడు దిక్కు లేకుండా పోయింది. పార్టీ పరిస్థితి చాలా దారుణంగా తయారయింది. పార్టీలో పదవులు తీసుకునేందుకు కూడా ఎవరు ముందుకు రావడం లేదు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. చివరికి 2014లో పార్టీ ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా.. పదవులు తీసుకునేందుకు ఎంతో ఆసక్తి చూపిన నాయకులు ఇప్పుడు మాత్రం మొహం చాటేస్తున్నారు. ఏలూరు జిల్లాలో పార్టీ పుట్టినప్పటినుంచి పార్టీ పదవులు తీసుకునేందుకు ఎంతో మంది నాయకులు క్యూలో ఉండేవారు. మొన్న పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోవడంతో అసలు ఇప్పుడు పార్టీ పదవి అంటేనే అందరూ భయపడుతున్నారు.

మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ‌నాని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగే వారు. ఇటీవల ఆయన జిల్లా అధ్యక్ష పదవితో పాటు.. వైసీపీకే పూర్తిగా రాజీనామా చేశారు. ఎన్నికలకు ముందు వరకు ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసు బాబు.. ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. పార్టీ ఓటమి తర్వాత ఆయన కూడా జిల్లా పార్టీ పగ్గాలు తీసుకునేందుకు ముందుకు రాలేదు. జగన్.. ఆళ్ళనాని, పుప్పాల వాసు బాబు, తెల్లం బాలరాజు ఇలా పలువురు నేతలను బతిమిలాడుకుని జిల్లా పార్టీ పగ్గాలు తీసుకోవాలని కోరినా ఎవరు ముందుకు రాలేదు. ఇక మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్ ఎన్నికలకు ముందు పార్టీ పరిస్థితి తనకు అర్థమై తప్పుకున్నారు.

ఏలూరు జిల్లా పార్టీ దిక్కులేనిది అయిపోవడంతో.. చివరకు కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకు ఈ పదవి కట్టబెట్టారు. దూలం నాగేశ్వరరావుకు జిల్లా పార్టీని సమన్వయం చేసేంత సీన్ లేదు. పైగా జిల్లాలో చాలా జూనియర్. ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు అంత వాయిస్ పవర్ కూడా లేదు. పార్టీకి ఎవరు దిక్కు లేకుండా పోవడంతో.. దూలం నాగేశ్వరరావును పిలిచి బతిమిలాడి.. ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పగ్గాలు అప్పగించారు. దూలం కూడా ఈ పదవి తీసుకుంటే వచ్చే ఎన్నికలలో తనకు కైకలూరు సీటు సేఫ్ అవుతుంది అన్న.. ఒక ఆలోచనతోనే ఇష్టం లేకపోయినా ఈ పదవి తీసుకున్నట్టు జిల్లా వైసీపీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: