అమరావతి విషయంలో బాబు కోర్కెలు నెరవేస్తున్న కేంద్రం!
ఈ నేపథ్యంలో ప్రధాన నాగరాలైనటువంటి విజయవాడ, గుంటూరు, ఒంగోలు వంటి ప్రాంతాలకు ఈ నగరాన్ని లింక్ చేయాల్సి ఉంటుంది. కేవలం రోడ్డు మార్గమే కాకుండా రైలు లైను కూడా వేయాలన్నది చంద్రబాబు కోరిక. దీని ప్రకారమే ఆయన 2017-18లోనే ఈ ప్రణాళికలను కేంద్రానికి అందించినప్పటికీ తర్వాత కాలంలో బాబుకు కేంద్రానికి మధ్య వివాదం తలెత్తడంతో అది కాస్త ఆగిపోయింది. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం గురించి అందరికీ తెలిసినదే. అసలు అభివృద్ధి అనే ఊసే పట్టలేదు జగన్ ప్రభుత్వానికి. దీంతో తాజాగా కూటమిగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. చంద్రబాబు అమరావతి ప్లానును.. రైల్వేకు అప్పగించడం జరిగింది. ఈ క్రమంలోనే రైల్వే శాఖ అమరావతి నూతన లైన్లకు సంబంధించి తాజా ప్రకటన విడుదల చేసింది.
ఇకపోతే విజయవాడ, గుంటూరులలోని ప్రధాన రైల్వే లైన్లతో అమరావతిని కలుపనున్నారు. హైదరాబాద్ రూట్ విషయానికొస్తే... ఎర్రుపాలెం టు అమరావతి టు నంబూరు మధ్య 56.53 కిలో మీటర్ల మేర డబుల్ లైన్ పడనుంది. అదేవిధంగా అమరావతి టు పెదకూరపాడు(గుంటూరు) మధ్య 24.5 కి.మీ సింగిల్ లైన్ రానుంది. ఇక సత్తెనపల్లి నుండి నరసరావుపేట మధ్య 25 కి.మీల సింగిల్ లైన్ నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం రైల్వే శాఖకు ప్రతిపాదించింది. ఇక తాజాగా ఎర్రుపాలెం నుండి అమరావతి; అమరావతి నుండి నంబూరు మధ్య 56.53 కి.మీ మేర డబుల్ లైన్ స్థానంలో తొలుత సింగిల్ లైన్ నిర్మాణానికి కేంద్రం ఓకే చెప్పింది. దీనికిగాను కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఖమ్మం జిల్లాల పరిధిలోని 450 హెక్టార్ల మేర భూసేకరణ చేయనున్నాయి.