శభాష్ లోకేష్ : మంగళగిరి కోసం అదిరిపోయే మాస్టర్ ప్లాన్?
మంగళ గిరి నియోజకవర్గ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి వీలుగా ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేశారు నారా లోకేష్. ఈ తరుణంలోనే... వివిధ సమస్యలను లోకేష్ దృష్టికి తెచ్చారు మంగళగిరి వాసులు. వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్న లోకేష్.....తక్షణమే సమస్యల పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చెయ్యాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇక కార్యక్రమం సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ... మంగళగిరి ప్రజల కోసం “ప్రజాదర్బార్” నిర్వహించాను అని తెలిపారు.
గత అయిదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించానని.... భారీ మెజారిటీ తో గెలిచిన తరువాత నాపై మరింత బాధ్యత పెరిగిందని వెల్లడించారు. నియోజకవర్గంలో అందుబాటులో ఉన్న రోజుల్లో ఉదయం 8 గంటలకు ప్రజల్ని కలిసి వారి సమస్యలు తెలుసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను అంటూ వ్యాఖ్యానించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని సైతం ఏర్పాటు చేసానని.... వీలైనంత త్వరగా నా దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇక అటు మంత్రిగా 2019లో పనిని ఎక్కడ ఆపానో అక్కడి నుండే తిరిగి ప్రారంభిస్తానని... వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న వాగ్దానాన్ని నెరవేర్చడానికి ప్రతి అవకాశాన్ని చేజిక్కించుకుంటానని ప్రకటించారు లోకేష్. ఈ సారి, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల కల్పనలో ఇతర రాష్ట్రాలకు తీవ్రమైన పోటీ ఇస్తుందని... ఐటీ ఎలక్ట్రానిక్ కంపెనీలను ఆకర్షించడానికి, రాష్ట్రం నుంచి వలస వెళ్లాల్సి వచ్చిన మన యువతకు ఉద్యోగాలు కల్పించడానికి నేను 2019లో వదిలిపెట్టిన చోటు నుండే పనిని తిరిగి పునః ప్రారంభిస్తానని వివరించారు.