పవన్ కల్యాణ్ను ఆకాశానికి ఎత్తేసిన ప్రధాని మోదీ?
ఈ నేపథ్యంలోనే శుక్రవారం రోజు ఎన్డీఏ పొలిటీషియన్లు, కొత్తగా ఎన్నికైన ఎంపీలందరూ పార్లమెంట్ కాంప్లెక్స్లో నరేంద్ర మోదీని మరోసారి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా సెలెక్ట్ చేసుకోవడానికి సమావేశమయ్యారు. దాంతో మోడీ మూడోసారి పీఎంగా బాధ్యతలు చేపట్టడానికి రెడీ అయిపోయారు. రిపోర్ట్స్ ప్రకారం నరేంద్ర మోదీ జూన్ 9న ఢిల్లీలో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
దీనికంటే ముందు ఎంపీలు అందరూ హాజరైన ఈవెంట్ లో మోదీ మాట్లాడుతూ.. లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అన్ని కూటమి పార్టీలపై పొగడ్తల వర్షం కురిపించారు. ఏపీ కూటమిలో భాగమైన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలను కూడా మోదీ అభినందించారు.
ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత, త్వరలోనే ఏపీ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టే నేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అటెండ్ అయ్యారు. వాళ్లు మోదీతో కలిసి వేదికపైనే దర్జాగా కూర్చుని కనిపించారు. టీడీపీ, జేఎస్పీ రెండూ 18 లోక్సభ స్థానాలను ఎన్డీయేకు అందించడంతో మోదీ బలపడ్డారు. మరోవైపు ఏపీలో బీజేపీ మూడు పార్లమెంటు సీట్లను కైవసం చేసుకుంది.
ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్డీయే కూటమికి అఖండ విజయాన్ని అందించారని మోదీ పేర్కొన్నారు. చంద్రబాబు సహకారంతో ఏపీలో బీజేపీ చాలా పెద్ద విజయం సాధించిందన్నారు. ఇదే సందర్భంగా పవన్ ఓ తుపాను అంటూ పవన్ కల్యాణ్ను మోదీ ప్రత్యేకంగా ఆకాశానికి ఎత్తేశారు. “అతని పేరు పవన్ అంటే హిందీలో గాలి, కానీ అతను ఆంధీ అంటే హిందీలో తుపాను" అంటూ మోదీ ప్రశంసించగా పవన్ కల్యాణ్ నవ్వుతూ స్పందించారు.