గౌడాంధ్రప్రదేశ్ : జోగి రమేష్ ప్రయాణం అసాధారణం.. గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా?
2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాక జోగి రమేష్ కు ఆర్టీసీ రీజనల్ ఛైర్మన్ పదవిని అందించారు. 2009లో మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే సీటును జోగి రమేష్ ఆశించారు. అయితే అప్పటి విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆ సీటును జోగి రమేష్ కు ఇవ్వనివ్వలేదు. అయితే వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎలాగైనా జోగి రమేష్ ను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించాలని పట్టుబట్టారు. ఆ విధంగా పెడన నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఛాన్స్ ఇచ్చారు. నాన్ లోకల్ అయినా సరే ఆయనకు ఈ సీటును కట్టబెట్టారు. అలా ఇక్కడ నిలబడిన జోగి రమేష్ టీడీపీ పార్టీ అభ్యర్థి కాగిత వెంకట్రావుపై 1,192 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దాంతో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తరువాత కాంగ్రెస్ను వీడారు. తర్వాత జగన్ వైసీపీ పార్టీ స్థాపించడంతో అందులో జాయిన్ అయ్యారు. 2014లో మైలవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమా మహేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. 2019లో పెడన నుంచి కంటెస్ట్ చేసే విజయం సాధించారు. ఈసారి అంటే 2024 ఎన్నికలలో పెనమలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో మూడు నియోజకవర్గాల (మైలవరం, పెడన, పెనమలూరు) నుంచి పోటీ చేసిన ఘనత జోగి రమేష్ కి దక్కుతుందని చెప్పవచ్చు. జోగి రమేష్ జగన్కు నమ్మినబంటు. వైఎస్ఆర్ ఎమ్మెల్యే పదవి ఇచ్చి ప్రోత్సహిస్తే జగన్ మంత్రి పదవి ఇచ్చి ఎంకరేజ్ చేశారు. ఈసారి ఆయన గెలిస్తే వైసీపీలో కింగ్ అవుతారు.