నెల్లూరు : జనసేనకు షాక్.. మరో కీలక నేత రాజీనామా..!!

murali krishna
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు కీలక మలుపు తీసుకుంటున్నాయి.. ఇప్పటికే వైసీపీ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుంది.. అయితే కూటమి లో మాత్రం సీట్ల పంచాయితీ ప్రకంపనలు సృష్టిస్తోంది. మూడు పార్టీలలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.సీటు దక్కని నేతల్లో అసమ్మతి ఒక్కసారిగా బయటపడింది.మరీ ముఖ్యంగా జనసేన పార్టీలో అసమ్మతి కాస్తా ఎక్కువగా కనిపిస్తోంది. జనసేన పార్టీలో టికెట్ దక్కని నేతలు బహిరంగంగానే తమ పవన్ కళ్యాణ్ చురకలు అంటిస్తున్నారు.. ప్రస్తుతం జనసేనలో టికెట్ దక్కని నేతలు ఒక్కొక్కరు ఆ పార్టీని వీడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పవన్ వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు చేస్తూ జనసేన నాయకులు పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. అయితే పార్టీలో మొదటి నుంచి ఉన్న నాయకులకు కూడా టికెట్ దక్కడం లేదు. 40 ఎమ్మెల్యే సీట్లు ఆశించిన జనసేన కార్యకర్తలకు  కేవలం 21 స్థానాల్లో మాత్రమే జనసేన పోటీ చేయడంపై ఆ పార్టీ కార్యకర్తలు తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు.

పొత్తులో భాగంగా వచ్చిన 21 స్థానాల్లో కూడా వేరే పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు కేటాయించడంపై జనసేనలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అనకాపల్లి నియోజకవర్గ ఇంచార్జ్‌ పరుచూరి భాస్కరరావు, మామ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్‌ పితాని బాలకృష్ణ,విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్‌ పోతిన మహేష్ మరియు పాముల రాజేశ్వరి వంటి నేతలు జనసేనకు రాజీనామా చేయగా, తాజాగా మరో కీలక నేత ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇంఛార్జ్ మనుక్రాంత్ జనసేనకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.వ్యక్తిగత కారణాల వల్ల జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవికి అలాగే జనసేన పార్టీ సభ్యత్వంతో పాటు నాకు కేటాయించిన అన్ని పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను.

నేను పార్టీలో ఉన్నంత కాలం ఎంతో విధేయుడిగా ఉన్నానని, గత 6 సంవత్సరాలుగా పార్టీకి అండగా ఉంటూ జనసేన పార్టీ నిర్మాణానికి ఎంతగానో కృషి చేశాను.ఇన్నాళ్లూ నాకు అండగా నిలిచిన మీ అందరికి మరియు జనసేన పార్టీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.నా నిర్ణయం ఎవరికైనా ఏదైనా అసౌకర్యాన్ని కలిగిస్తే దయచేసి నా క్షమాపణలను అంగీకరించండి. ప్రతి ఒక్కరూ నా నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నానుఅంటూ తన లేఖలో రాసుకొచ్చారు. అయితే పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యవహారశైలి నచ్చకనే జనసేన నుంచి ఆయన బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. మనుక్రాంత్ త్వరలోనే జగన్ సమక్షంలో వైసీపీలో చేరే అవకాశాలు  కనిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: