కేటీఆర్పైనా కేసు.. షాకులిస్తున్న ఈడీ?
ఈ క్రమంలో కవిత సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్, హరీశ్ రావులు కవిత నివాసానికి చేరుకున్నారు. అయితే ఆమె ఇంటి వద్దకు వచ్చిన న్యాయవాదులతో పాటు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులను ఈడీ అధికారులు అడ్డుకున్నారు. వారిని లోపలకి అనుమతించలేదు. దీంతో వారు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కొద్ది సేపటి తర్వాత కవిత న్యాయవాదులను, వీరిని లోపలకి అనుమతించారు. ఈ సందర్భంగా కవితను ట్రాన్సిట్ వారెంట్ లేకుండా అరెస్టు చేయడంపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ విషయమై ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఆయన ఈడీ అధికారులను నిలదీయడంతో అధికారులు ఆ దృశ్యాలను వీడియో రూపంలో చిత్రీకరించారు. ఈ సందర్భంగా కూడా ఆయన కవిత అరెస్టుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సరైన ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. అరెస్టు చేయబోమని ఈడీ, అధికారులు లిఖిత పూర్వకంగా ఇచ్చిన లేఖను చూపించారు.
అయితే కవితను అరెస్టు చేసిన కొద్ది సేపటికే ఈడీ అధికారులు కేటీఆర్ కు షాక్ ఇచ్చారు. ఆయనపై కేసు నమోదు చేయాలని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కవితను అరెస్టు చేసేందుకు తాము ఆమె నివాసానికి వెళ్లిన సమయంలో కేటీఆర్ దౌర్జన్యం చేశారని ఈడీ అధికారులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సమయంలో కేటీఆర్ ఈడీ అధికారిణి భానుప్రియా మీనాతో పాటు మరికొందిరితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తమ విధులకు అడ్డు తగిలారు అని అధికారులు కేటీఆర్ పై కేసు పెట్టారు.