అమరావతి : చంద్రబాబు పీఎస్ దొరుకుతారా ?
చంద్రబాబునాయుడు కేసుల నేపధ్యంలో ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకున్నది. అదేమిటంటే గతంలో చంద్రబాబుకు పీఎస్ గా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్ ను ఉద్యోగంలో నుండి సస్పెండ్ చేసింది. పెండ్యాల సెక్రటేరియట్ లోని ప్లానింగ్ విభాగంలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. స్కిల్ స్కామ్ తో పాటు అంతకుముందు అమరావతి నిర్మాణాల్లో ముడుపులు అందుకున్న కేసులో కూడా పెండ్యాలే కీలక వ్యక్తి.
ప్రతి అవినీతి కేసులోను పెండ్యాల ద్వారానే చంద్రబాబుకు ముడుపులు అందినట్లు బాగా ప్రచారంలో ఉంది. స్కిల్ స్కామ్ లో సీఐడీ కోర్టుకు అందించిన రిమాండ్ రిపోర్టులో ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పింది. స్కిల్ స్కామ్ లో విచారణకు హాజరవ్వాలని సీఐడీ నోటీసులు జారీచేయగానే పెండ్యాల దేశంనుండి పారిపోయారు. ప్రభుత్వం దగ్గర అనుమతి కూడా తీసుకోకుండానే అమెరికాకు పారిపోయారు. అనారోగ్యంగా ఉందని, చికిత్స చేయించుకోవాలని ఉన్నతాధికారులకు పెండ్యాల మెయిల్లో లెటర్ పంపి దేశం వదిలి పారిపోయారు.
విధుల్లో చేరాలని ప్రభుత్వం పెండ్యాలకు సమాచారం ఇచ్చినా ఖాతరుచేయలేదు. దాంతో నోటీసు పీరియడ్ అయిపోయన వెంటనే పెండ్యాలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నిజానికి ఉద్యోగం చేస్తేనే కుటుంబాన్ని పోషించుకోవాలనే స్ధాయిని శ్రీనివాస్ ఎప్పుడో దాటిపోయారని ప్రభుత్వ వర్గాలే చెబుతున్నాయి. ఉద్యోగం అన్నది పెండ్యాలకు కేవలం ఒక వ్యాపకం మాత్రమే. చంద్రబాబు దగ్గర దాదాపు పదేళ్ళు పీఏ గా పీఎస్ గా పనిచేసిన తర్వాత కూడా పెండ్యాలకు ఇంకా ఉద్యోగం అవసరమని ప్రభుత్వం కూడా అనుకోవటంలేదు.
కాకపోతే చంద్రబాబు అవినీతిని సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టాలంటే పెండ్యాల కూడా కీలకం. ఎందుకంటే పెండ్యాలే ముడుపులను అందుకుని చంద్రబాబుకు అందించే వాడని సీఐడీ బలంగా నమ్ముతోంది. కాబట్టి ఏఏ మార్గాల్లో ఎవరెవరి దగ్గర నుండి ముడుపులు ఎంతెంత వచ్చేవనే విషయలు పూర్తిగా పెండ్యాలకు తెలుసన్నది సీఐడీ ఆలోచన. ఉద్యోగంలో నుండి సస్పెండ్ చేసిన తర్వాత రాష్ట్రానికి రావాల్సిన అవసరం ఏముంటుంది ? సస్పెండ్ కాదు ఏకంగా డిస్మిస్ చేసినా పెండ్యాల పట్టించుకోరు.