అమరావతి : పవన్ పై కాపులు మండుతున్నారా ?
వారాహి యాత్ర విషయంలో కాపు సామాజికవర్గంలో కొందరు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మండుతున్నారు. ఈనెల 14వ తేదీనుండి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి వారాహి యాత్ర మొదలవుతున్న విషయం తెలిసిందే. నియోజకవర్గంలోని కత్తిపూడి గ్రామంలో బహిరంగసభ జరగబోతోంది. తన యాత్రను పవన్ ఇక్కడినుండే ఎందుకని మొదలుపెడుతున్నట్లు ? అన్నదే పెద్ద చర్చనీయాంశమైంది.
కొందరు కాపులు చెబుతున్నది ఏమంటే ప్రత్తిపాడు ముద్రగడ పద్మనాభం నియోజకవర్గం. కాపుల కోసం ముద్రగడ ఎన్ని ఆందోళనలు, ఉద్యమాలు చేశారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికీ కాపుల ఉద్యమం అంటే అందరికీ గుర్తొచ్చేది ముందుగా ముద్రగడ పేరే. అలాంటి ముద్రగడతో పవన్ కల్యాణ్ కు సఖ్యతలేదు. ముద్రగడ ఎవరితోను ఎక్కువ కాలం ఇమడలేరు. ఇదే సమయంలో తనకు సమానంగా పక్కవాళ్ళకు పేరొస్తే పవన్ సహించలేరు.ఈ కారణంగానే జనబలం ఉన్న నేతలను పార్టీలోకి రానీయలేదట.
అందుకనే జనసేనలోకి ముద్రగడ వెళ్ళలేదు, పవన్ కూడా ముద్రగడను రమ్మని ఆహ్వానించలేదు. అయితే కాపులంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది మాత్రం ముద్రగడనే. ముద్రగడకేమో చాలా క్లీన్ ఇమేజుంది. ఇదే సమయంలో పవన్ మీద ప్యాకేజీస్టార్ అనే ముద్ర స్ధిరపడిపోయింది. పైగా పాతపంచాయితీల కారణంగా పవన్ అంటే ముద్రగడ మండిపోతున్నారు. అందుకనే పవన్ను ఏమాత్రం ముద్రగడ లెక్కచేయటంలేదు. నిజానికి ఇద్దరి మధ్య ప్రత్యక్షంగా గట్టుతగాదాలేమీ లేకపోయినా ఇద్దరిలోను విపరీతంగా ఉన్న ఇగో వల్లే బాగా దూరంపెరిగిపోయింది.
దాంతో ముద్రగడ తనను గుర్తించటంలేదన్న ఇగో కారణంగానే అకారణంగా పవన్ మండిపోతున్నారట. అందుకనే తన సత్తా ఏమిటో చూపాలనే ప్రత్తిపాడు నియోజకవర్గంతోనే వారాహియాత్రను మొదలుపెడుతున్నట్లు కాపులు అనుమానిస్తున్నారు. ముద్రగడను పవన్ టార్గెట్ చేసినట్లుగా కాపుల్లో కొందరు ఫీలవుతున్నారు. వారాహి యాత్ర వ్యవహారం ఏదో జూన్ 14 బహిరంగసభతో తేలిపోతుంది. ఇక్కడ గనుక ముద్రగడను పవన్ టార్గెట్ చేశారంటే అంతే సంగతులు. ముద్రగడ వ్యవహారాన్ని పవన్ టచ్ చేయకపోతే ప్రాబ్లెమ్ ఉండదు. లేకపోతే గొడవైపోవటం ఖాయమే.