అమరావతి : 30 రోజుల్లో హంతకులెవరో బయటపడతారా ?

Vijaya



మరో నెలరోజుల్లోగా వివేకానందరెడ్డి మర్డర్ కుట్ర బయటపడుతుందా ? ఇపుడిదే విషయాన్ని జనాలు చర్చించుకుంటున్నారు. వివేకా మర్డర్ జరిగి సుమారు ఐదేళ్ళయిపోయింది. ఈ ఐదేళ్ళల్లో కేసు దర్యాప్తు ఎంత గబ్బుపట్టాలో అంతా పట్టేసింది. చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నపుడు మర్డర్ జరిగితే ఇప్పటివరకు హంతకులెవరు ? ఎందుకు హత్యచేశారు అన్న విషయాలు బయటకురాలేదు. దీనికి పూర్తి కారణం అప్పుడు చంద్రబాబు, ఇపుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలనే చెప్పాలి.



హత్య జరిగిన తర్వాత తొమ్మిది మాసాలు అధికారంలో ఉన్న చంద్రబాబు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించి నిజాలను రాబట్టలేకపోయారు. తర్వాత జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దర్యాప్తు ఇలాగే జరిగింది. దాంతో వివేకా కూతురు డాక్టర్ సునీత హైకోర్టులో కేసు వేసి సీబీఐ దర్యాప్తు మొదలుపెట్టించారు. సీబీఐ అయినా దర్యాప్తును సక్రమంగా చేసిందా అంటే లేదు. ఎంతసేపు ఎవరినో ఒకళ్ళని ఇరికించి, దోషులుగా తేల్చే ప్రయత్నం చేసిందే కానీ అసలు వాస్తవాలను బయటకు తీసుకురాలేకపోయింది.



జరిగిన హత్యను అన్నీ కోణాల్లో విచారించుంటే దోషులెవరు ? హత్యకు కారణాలు ఏమిటనేది తెలిసుండేదేమో. కానీ దర్యాప్తు అధికారి రామ్ సింగ్ ఎంతసేపు చంద్రబాబు అండ్ కో తో పాటు ఎల్లోమీడియా ఆరోపణల ఆధారంగానే దర్యాప్తు చేశారు. కాబట్టే హత్యకు కారణం రాజకీయ వైరమని మాత్రమే చెప్పారు. హత్యకు కారణం రాజకీయ వైరం కాకుండా ఇంకేదో ఉందని అనిపిస్తున్నా దర్యాప్తు అధికారి మాత్రం ఆదిశగా విచారించలేదు. రాజకీయ వైరం కాదనటానికి చిన్న లాజిక్కుంది. ఎంపీ టికెట్ కోసమే వివేకాను అవినాష్ చంపించాడని చంద్రబాబు, ఎల్లోమీడియా రచ్చ చేస్తోంది. అయితే హత్య జరిగేటప్పటికే అవినాష్ ఎంపి. రెండోసారి పోటీ చేస్తున్నాడు.



అవినాష్ గెలుపుకు వివేకా ప్రచారం కూడా చేస్తున్నారు. కాబట్టి టికెట్ కోసం వివేకాను అవినాష్ చంపించాల్సిన అవసరం ఏముంది.  అందుకనే  చంద్రబాబు, ఎల్లోమీడియా చెప్పినట్లే రామ్ సింగ్ తనను కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కడప ఎంపీ అవినాష్ రెడ్డి పదే పదే ఆరోపిస్తున్నారు. ఇదే ఆరోపణతో నిందితుల్లో ఒకడైన శివశంకరెడ్డి భార్య తులశమ్మ సుప్రింకోర్టులో కేసువేశారు.



దీని ఫలితంగానే సీబీఐపై సుప్రింకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేసి రామ్ సింగ్ ను దర్యాప్తు నుండి బయటకు పంపేసింది. డీఐజీ చౌరాసియా నాయకత్వంలో ప్రత్యేకంగా బృందాన్ని ఏర్పాటుచేసింది. దర్యాప్తు జరిపి, దోషులను, కారణాన్ని తెలుసుకునేందుకు ఏప్రిల్ 30 వరకు గడువిచ్చింది. ఇప్పటికైనా హత్య చేసిన వారెవరు ? కారణం ఏమిటో బయటపడుతుందా ?  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: