ఏపీ కరెంట్‌ కోతల గుట్టు విప్పిన చంద్రబాబు?

Chakravarthi Kalyan
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాష్ట్రంలో విద్యుత్ కోతలపై టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతోనే విద్యుత్ రంగం నిర్వీర్యం అయ్యిందన్న చంద్రబాబు.. నాణ్యమైన, నిరంతరాయమైన విద్యుత్ అందించినపుడే పారిశ్రామిక, వ్యవసాయ, సేవా రంగాలు పురోభివృద్ధి సాధిస్తాయని గుర్తు చేశారు. తమ హయాంలో 45 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండే పరిస్థితి ఇప్పుడు ఎందుకు లేదని ప్రశ్నించిన చంద్రబాబు.. బొగ్గు సరఫరా సంస్థలకు బకాయిలు చెల్లించకపోవడం ఇందుకు కారణం కాదా అని ప్రశ్నించారు.

విద్యుత్ సంస్థల పేరిటి తెచ్చిన 26 వేల కోట్ల అప్పులు ఏమయ్యాయి...చార్జీల పెంపుతో వచ్చిన 16 వేల కోట్లు ఏమయ్యాయని చంద్రబాబు ప్రశ్నించారు. భవిష్యత్ అవసరాల కోసం సౌర, పవన విద్యుత్ వంటి పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యమిచ్చామన్న చంద్రబాబు.. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న విద్యుత్ కోతలు, ధరల వాతలకు.. ప్రభుత్వ నిర్లక్ష్యం, కక్ష పూరిత, అవినీతి విధానాలే కారణమన్నారు. విద్యుత్ పీపీఏల రద్దు తో ముఖ్యమంత్రి, అధికారులు మొండిగా ముందుకు వెళ్లి విద్యుత్ వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయని చంద్రబాబు ఆరోపించారు.

రబీలో బోర్ల కింద సాగవుతున్న పంటలు మరో 15-20 రోజుల్లో చేతికొస్తాయని గుర్తు చేసిన చంద్రబాబు.. ఇలాంటి సమయంలో విద్యుత్‌ లేక పంటలు ఎండిపోతున్నాయన్నారు. అనంతపురం, చిత్తూరు సహా పలు ప్రాంతాల్లో ఎండిన పంటలే ఇందుకు సాక్ష్యమని గుర్తు చేశారు. అప్రకటిత కరెంటు కోతలతో వ్యవసాయ అనుబంధ రంగాలైన ఆక్వా, పౌల్ట్రీ పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతున్నాయని.. పరిశ్రమలకు పవర్ హాలిడే కారణంగా రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది జీవనోపాధి కోల్పోతారని నిపుణులు చెబుతున్నారని చంద్రబాబు లేఖలో తెలిపారు.

కరంట్‌ కోతల కారణంగా కడప జిల్లా రిమ్స్ ఆస్పత్రిలో రెండు రోజుల్లో ముగ్గురు శిశువులు ప్రాణాలు కోల్పోయారని.. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో సెల్ ఫోన్ లైట్ల వెలుగులో ప్రసవాలు చేశారని చంద్రబాబు అన్నారు. గ్రామాల్లో గంటల గంటల విద్యుత్ కోతలతో ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. విద్యుత్ సంక్షోభం పై మీరు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: