సీఎం జగన్ ఎంత త్వరగా విశాఖ వెళ్లి కూర్చొంటే మాకు మరిన్ని సీట్లు పెరుగుతాయని.. ఇప్పటికే విశాఖలో అరాచకం.. భూకబ్జాలు పెరిగాయి.. సీఎం వెళ్తే మరింతగా పెరుగుతాయన్నారు నారా లోకేష్. విజయసాయి దెబ్బకు ఇప్పుడు విశాఖలో అందరూ భయపడుతున్నారు.. రేపు సీఎం వెళ్తే ఆయనకు భయపడతారని.. 1200 గజాల భూమి ఉన్న ప్రతి విశాఖ వాసి గజగజలాడుతున్నాడని పేర్కొన్నారు నారా లోకేష్. పరిపాలనా కేంద్రీకరణ.. అభివృద్ధి వికేంద్రీకరణతోనే సమగ్రాభివృద్ధి అని.. పరిపాలనా వికేంద్రీరణ అంటే పరిపాలనా విధ్వంసమే అని ఫైర్ అయ్యారు. అభివృద్ది వికేంద్రీకరణ చేసింది మేమేనని.. టీడీపీ హయాంలో వచ్చిన 5.40 లక్షల ఉద్యోగాలు 13 జిల్లాల్లో వచ్చాయే తప్ప.. ఒక్క ఉద్యోగం కూడా అమరావతి ప్రాంతానికి రాలేదని పేర్కొన్నారు నారా లోకేష్. పరిపాలనా ఒకే చోట ఉంచి.. అన్ని జిల్లాల్లో అభివృద్జి చేయాలనేదే మా లక్ష్యమని.. మా లక్ష్యానికి అనుగుణంగా ఆటోమొబైల్ అనంతపురం, ఖనిజాలు, సోలార్ కంపెనీలు కర్నూలు, ఐటీ విశాఖ, ఎలక్ట్రానిక్స్ చిత్తూరు జిల్లాల్లోకి తెచ్చామన్నారు నారా లోకేష్.
మేం తెచ్చిన వాటిని కంటిన్యూ చేసినా చాలా పరిశ్రమలు వచ్చుండేవని.. వచ్చీ రావడంతోనే పీపీఏల రద్దు అంటూ ప్రకటించిన జగన్.. పెట్టుబడిదారుల్లో భయాందోళనలు పుట్టించారని పేర్కొన్నారు నారా లోకేష్. పీపీఏల రద్దు కారణంగా సుజలాన్ అనే అతి పెద్ద కంపెనీ దివాళ తీసింది.. అందులో పెట్టుబడులు పెట్టిన చాలా పెద్ద పెద్ద కంపెనీలు దెబ్బతిన్నాయని అన్నారు నారా లోకేష్. ఏపీ ఆర్ధిక పరిస్థితి శ్రీలంక ఆర్ధిక పరిస్థితితో సమానంగా ఉందని.. పరిస్థితి ఇలాగే ఉంటే ఏపీలో ఏదో రోజు ఆర్ధిక ఎమర్జెన్సీ ప్రకటించే పరిస్థితి వస్తుందని నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆర్ధిక ఎమర్జెన్సీ వస్తే బ్యాంకుల్లో ఉన్న ప్రజల డబ్బు, బంగారాన్ని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చన్నారు నారా లోకేష్. పీపీఏల రద్దు నిర్ణయంతో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు జంకుతున్నాయని ఆయన చెప్పారు.