ఎంబసీ వార్నింగ్‌: ఉక్రెయిన్‌లో ఈ పనులు అస్సలు చేయొద్దు..!

Chakravarthi Kalyan
ఉక్రెయిన్‌లో ఇండియన్లు దాదాపు 20 వేల మంది వరకూ చిక్కుకుపోయారు. వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు మన విదేశాంగ శాఖ అన్నివిధాలా ప్రయత్నాలు చేస్తోంది. అయితే యుద్ధం కారణంగా గగనతలం మూసి ఉండటంతో వారిని తీసుకురావడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉక్రెయిన్ నుంచి పొరుగుదేశాలకు రోడ్డు మార్గంలో తరలించి.. అక్కడి నుంచి విమానాల్లో మన వాళ్లను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.


అయితే.. ఈ లోపు ఉక్రెయిన్‌లో ఉన్న ఇండియన్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఇండియన్ ఎంబసీ సూచిస్తోంది. ఉక్రెయిన్‌లోని భారతీయ పౌరులకి కీవ్ లోని భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది. ప్రధానంగా సరిహద్దు పోస్టుల వద్ద ఉన్న భారత ప్రభుత్వ అధికారులతో ముందస్తు సమన్వయం లేకుండా సరిహద్దులకు ఎవరూ వెళ్లవద్దని హెచ్చరించింది. వివిధ సరిహద్దు చెక్‌పాయింట్‌ల వద్ద పరిస్థితి చాలా సున్నితంగా ఉందని.. పొరపాటున కూడా అటువైపు వెళ్లి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని ఎంబసీ అధికారులు సూచిస్తున్నారు.


భారత పౌరులను తరలించడం కోసం పొరుగు దేశాలలోని ఎంబసీలతో నిరంతరం ప్రయత్నాలు జరుగుతున్నాయని... ముందస్తు సమాచారం లేకుండా సరిహద్దు చెక్‌పాయింట్‌లకు చేరుకునే భారతీయ పౌరులకు సహాయం చేయడం ఎంబసీకి కష్టమవుతుందని తెలిపింది. ఉక్రెయిన్‌లోని పశ్చిమ నగరాల్లో నీరు, ఆహారం, వసతి  ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉన్న చోట ఉండటం మంచదని సూచించింది. అక్కడి పరిస్థితిల గురించి తెలుసుకోకుండా సరిహద్దు చెక్ పాయింట్‌లకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఎంబసీ అధికారులు హెచ్చరించారు.


ప్రస్తుతం ఉక్రెయిన్ తూర్పు సెక్టార్‌లో ఉన్న ఇండియన్లు తాము మళ్లీ చెప్పేవరకూ వారి ప్రస్తుత నివాస స్థలాల్లోనే ఉండాలని ఎంబసీ అధికారులు సూచించారు. వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని.. ఆహారం, నీరు మరియు సౌకర్యాలు అందుబాటులో ఉంచుకుని పరిస్థితి చక్కబడే వరకూ ఓపికగా ఉండాలని సూచించింది. అనవసరంగా బయటకు వచ్చి చిక్కుల్లో పడవద్దని హెచ్చరించింది. ఇండియన్లు ఎప్పటికప్పుడు తమ పరిసరాల్లో జరిగే పరిణామాల గురించి తెలుసుకోవాలని ఎంబసీ సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: