లంచ్ మీట్ కు కేసీఆర్..ముంబయి దారుల్లో తెలంగానం !
మంబయి దారుల్లో రేపు తెలంగాణ సీఎం కేసీఆర్ హంగామా చేయనున్నారు.ఈ మేరకు అక్కడి ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేతో భేటీ కానున్నారు.ఇప్పటికే కేసీఆర్ పోరాటంపై,ముఖ్యంగా మోడీపై వినిపిస్తున్న అసంతృప్తవాదంపై మహారాష్ట్ర సీఎం ఆనందం వ్యక్తం చేశారు.మీ పోరాటం గొప్పగా ఉందని అంటూనే దేశ సమగ్రత కోసం మాట్లాడాల్సిన తరుణం ఆసన్నమైంది అన్న అర్థం ధ్వనించేలా ఆయన తన సందేశంను పంపారు కూడా! అదేవిధంగా కేసీఆర్ పోరుబాటకు మద్దతు ప్రకటించి శుభాకాంక్షలు కూడా అందించారు.
మోడీని వ్యతిరేకించేందుకు తాము సిద్ధమేనన్న సంకేతాలు స్పష్టం మయిన రీతిలో ఇచ్చారు.ఇవన్నీ రేపటివేళ ఏ విధంగా ప్రభావితం చేయనున్నాయో అన్నది ఇప్పటి చర్చకు ఆస్కారం ఇస్తున్న ప్రధాన అంశం.మరోవైపు దేశ రాజకీయాలపై మనసు పారేసుకుంటున్న కేసీఆర్ ఆ స్థాయిలో ప్రభావితం చేస్తారో లేదా ? అన్నది మరో సందేహం.ఎందుకంటే గతంలోనే ఈ విధంగానే ప్రయత్నించి విఫలం అయ్యారు కేసీఆర్.తెలంగాణ రాష్ట్ర సమితి బాధ్యతలు కేటీఆర్ కు అప్పగించి తరువాత దేశ రాజకీయాల్లో పూర్తిగా బిజీ కావాలని యోచిస్తున్నారు.
ఈ క్రమంలో వసంత్ విహార్ లో నిర్మాణానికి పూనుకున్న తెలంగాణ భవన్ పూర్తికి కూడా దృష్టి సారించనున్నారు.వీటితో పాటు ఇంకొన్ని పనులు పూర్తి చేసి దేశ రాజకీయాల్లో ప్రధానంగా హైలెట్ అయ్యే విద్యుత్, వ్యవసాయం, పారిశ్రామిక రంగం, ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు వీటిపై మాట్లాడేందుకు ఆయన నిపుణులతో మాట్లాడేందుకు, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా మోడీ ఏ విధంగా పనిచేస్తున్నారన్నది చెప్పేందుకు ఆయన అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ క్రమంలో ఆయన తనదైన రాజకీయ వ్యూహాలు సమీకరణాలు కూడికలు మరియు తీసివేతలపై ఎక్కువగా దృష్టి నిలుపుతున్నారు. పార్టీతో పాటు ప్రభుత్వ నిర్వహణ బాధ్యతలు కూడా కేటీఆర్ కు అప్పగించి, ఉగాది తరువాత జాతీయ స్థాయి రాజకీయాల్లో ఆయన బిజీ కానున్నారు అని కూడా తెలుస్తోంది. అందుకు రేపటి సమావేశం ఏ మేరకు ఉపయోగపడుతుంది అన్నది కూడా ఇప్పుడిక అత్యావశ్యకం.