లాస్ట్‌ ఛాన్స్‌: చర్చలకు రమ్మన్న జగన్‌ సర్కార్‌

Chakravarthi Kalyan
ఈనెల 7 నుంచి సమ్మెకు వెళ్తామని ఇప్పటికే నోటీసు ఇచ్చిన ఉద్యోగ సంఘాలను బుజ్జగించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఉద్యోగ సంఘాల నేతలను ఏపీ ప్రభుత్వం చర్చలకు పిలిచింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో మంత్రుల కమిటీతో చర్చలకు రావాలని ఇప్పటికే ఉద్యోగ సంఘ నేతలకు ఆహ్వానం అందింది. పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సభ్యులకు ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి లేఖ రాసారు.


అయితే.. ఇప్పటికే ఇలాంటి చర్చలకు వచ్చేది లేదని.. ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు. అయితే.. మరీ ఇలా భీష్మించుకుని కూర్చుంటే అసలుకే ఎసరు వస్తుందేమో అన్న భయాందోళనలూ ఉద్యోగ సంఘాల నేతల్లో ఉన్నాయి. అందుకే ఈసారి చర్చలకు వెళ్లాలని ఉద్యోగ సంఘాల నేతలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. గతంలోనూ ప్రభుత్వం కమిటీ తరుపున చర్చలకు ఆహ్వానించినా ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం వెళ్లలేదు. కమిటీ సభ్యులు రోజూ ఉద్యోగ సంఘ నేతల కోసం ఎదురుచూసి ఓ ప్రెస్ మీట్ పెట్టి పరిస్థితి ఏంటో మీడియాకు చెప్పి వెళ్లిపోయేవారు.


మొదట్లో చర్చలకు వెళ్లమని చెప్పిన ఉద్యోగ సంఘాల నేతలు.. ఆ తర్వాత తమకు లిఖిత పూర్వక హామీ ఇస్తే తప్ప చర్చలకు వెళ్లమని తేల్చి చెప్పారు. ఇప్పుడు లిఖిత పూర్వకంగా ఆహ్వానం వచ్చినందున ఉద్యోగ సంఘ నేతలు చర్చలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకసారి చర్చలు అంటూ జరిగితే.. ఆ తర్వాత ఏదో ఒక ఫలితం వస్తుంది. కానీ.. ఇప్పటి వరకూ చర్చల ఊసే ఉద్యోగ సంఘాలు ఎత్తలేదు. ఇప్పుడు చర్చలకు సై అంటుంటే.. చర్చలు తప్పకుండా జరుగుతాయన్న విషయం స్పష్టం అవుతోంది.


చర్చలకు వెళ్లాలంటే ముందు మూడు డిమాండ్లు నెరవేర్చాలని ఉద్యోగులు షరతు పెడుతున్నారు. కొత్త పీఆర్సీ జీవోలు రద్దు చేయాలని.. పాత నెల జీతమే ఇవ్వాలని.. అశుతోష్ కమిటీ నివేదికను బయటపెట్టాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి చర్చలు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ.. చర్చల్లో సానుకూల ఫలితం వస్తుందా.. రాదా అన్నది ఇప్పుడే చెప్పలేం సుమా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: