రణతంత్రం : దేశ రాజధానిలో తెలుగు రాష్ట్రాలకు అవమానం?
కేంద్రాన్ని నిలదీసే దమ్ము రాష్ట్రాలకు లేదు అని తేలిపోయింది.ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు అస్సలు లేనేలేదు అని తేలిపోయింది.ఎన్నడూ లేని విధంగా గణతంత్ర దినోత్సవాన మన రాష్ట్ర శకటం కనీసం ప్రదర్శనకు కూడా నోచుకోకపోవడం అంటే అవమానం కాకపోతే అదేమయినా గౌరవమా? అయినా ఏం జరిగినా కూడా మనోళ్లంతా గమ్మునుంటారు.రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా చేసుకుని ఢిల్లీలో తమదైన పావులు కదుపుతారే కానీ ప్రాంతం, ప్రయోజనం అన్నవి పట్టించుకుంటారా?
గణతంత్ర దినోత్సవ వేడుకులను పురస్కరించుకుని కొత్త అధ్యాయం రాయనున్నారు మోడీ.ఇందులోభాగంగా ఈ నెల 24 నుంచి వేడుకలు నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఓ వైపు ఆజాదీ కా అమృత్రోత్సవ్ జరుగుతుండగా, మరోవైపు నేతాజీ 125 వ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 24 నుంచే గణతంత్ర వేడుకలు ప్రారంభించి తన గురుతర బాధ్యతలను నిర్వర్తించాలని యోచిస్తున్నారు మోడీ.ఇంతవరకూ బాగానే ఉన్నా మోడీ ఆలోచనలకు అనుగుణంగా పాపం మన తెలుగు రాష్ట్రాలే లేవు. ఆ మాటకు వస్తే పక్కనున్న తమిళనాడు కూడా లేదు.
ఇంకా చెప్పుకుంటే ఇరుగున ఉన్న కేరళ కూడా లేదు.ఎందుకంటే ఈసారి పరేడ్ కు మన తెలుగు రాష్ట్రాల శకటాలేవీ ఎంపిక కాలేదు.దీన్నొక అవమానంగా భావించాలి.ఆల్రెడీ భావించారు కూడా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఆమె పంపిన శకటం కూడా తిరస్కృతికి లోనయింది.కోల్ కతా నుంచి పంపిన శకటం ఎందుకు ఎంపిక కాలేదని మమతా అడిగినంత వేగంగా కోపంగా మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడగలేదు.అడిగే సాహసం ఇప్పట్లో చేయలేరు కనుక ఈ వివాదం ఏదో ఒక విధంగా ముగిసిపోవడం ఖాయం.