జోగికి సొంత పోరు..సెట్ చేయకపోతే కష్టమే!

M N Amaleswara rao
అధికార వైసీపీలో ఎక్కడకక్కడ సొంత పోరు ఎక్కువైపోయింది. ప్రత్యర్ధి నేతల కంటే సొంత నేతలే ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా రాజకీయం చేసే పరిస్తితులు కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల అయితే నాయకులు బహిరంగంగా మాట్లాడుతూ విమర్శలు చేసేస్తున్నారు. రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో ఇదే పరిస్తితి ఉంది. చాలా చోట్ల వైసీపీలో ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ ఆధిపత్య పోరు వల్ల వైసీపీకి భారీగానే నష్టం జరిగేలా ఉంది. ఆధిపత్య పోరు ఎక్కువ ఉంటే ఇటీవల దర్శి మున్సిపాలిటీ ఎన్నికలు నిరూపించాయి. అక్కడ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిల మధ్య రచ్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఆ రచ్చ వల్లే గెలవాల్సిన దర్శి మున్సిపాలిటీలో వైసీపీ ఓడిపోయింది.
అటు వెళితే నగరిలో ఎంత రచ్చ జరుగుతుందో తెలిసిందే. అలాగే చిలకలూరిపేట, నందికొట్కూరు, పాయకరావుపేట, కర్నూలు సిటీ, గూడూరు, తాడికొండ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు నడుస్తుంది. ఇక ఈ పోరు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో కూడా జరుగుతుంది. పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌కు, వైసీపీ నేత ఉప్పాల రామ్‌ప్రసాద్ వర్గాలకు పెద్దగా పడదనే విషయం తెలిసిందే.
మొదట నుంచి వీరి ఇరువురుకు సీటు విషయంలో రచ్చ నడుస్తూనే ఉంది. అయితే ఇటీవల ఉప్పాల కోడలు హారికకు జెడ్పీ చైర్‌పర్సన్ పదవి ఇచ్చారు. దీంతో కాస్త పోరు తగ్గినట్లే కనిపించింది. కానీ ఆ మధ్య పెడన జెడ్పీటీసీ ఎన్నిక విషయంలో వీరి వర్గాల మధ్య రచ్చ నడిచిందని తెలిసింది. అభ్యర్ధి విషయంలో పెద్ద రచ్చే జరిగిందని సమాచారం. ఆ రచ్చ వల్లే పెడన జెడ్పీటీసీ స్థానంలో వైసీపీ ఓడిపోయింది. అయితే వచ్చే ఎన్నికల్లో కూడా ఈ ఆధిపత్య పోరు కొనసాగితే ఎమ్మెల్యే జోగి రమేష్‌కు పెద్ద తలనొప్పిగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా టీడీపీకి అడ్వాంటేజ్ అవుతుంది. పైగా టీడీపీతో జనసేన గెలిస్తే జోగికి గెలవడమే కష్టం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: