జ‌గ‌న్ న‌మ్మించి మోసం చేశాడ‌ని సీనియ‌ర్ నేత ఆవేద‌న‌...!

VUYYURU SUBHASH
మర్రి రాజశేఖర్ గుంటూరు జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన తొలి నాయకుడు. చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే ... పైగా ఐదు దశాబ్దాలుగా కాంగ్రెస్ ఆ తర్వాత వైసిపిని మాత్రమే నమ్ముకుని నీతి నిజాయితీతో రాజకీయం చేస్తున్న కుటుంబానికి చెందిన వ్యక్తి. దివంగత వైఎస్ఆర్ తో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్న రాజశేఖర్ ఇప్పుడు రాజకీయంగా రోడ్డున పడిపోయారు.

గత ఎన్నికలకు ముందు విడ‌దల రజినికి సీటు ఇచ్చిన క్రమంలో జగన్ రాజశేఖర్ ను ... ఎమ్మెల్సీ చేసి మంత్రి చేస్తానని చిలకలూరిపేట బహిరంగసభలో స్వయంగా హామీ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు రాజశేఖర్‌కు  కనీసం ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదు. గత ఎన్నికల్లో టిడిపి నుంచి ఓడిపోయిన పార్టీలో చేరిన నేతలకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన జగన్ ... రాజశేఖర్ ను మాత్రం గుర్తు పెట్టుకో లేదు. అయితే తాజాగా రాజశేఖర్ బావమరిది, మాజీ ఎమ్మెల్యే సోమేపల్లి సాంబయ్య కుమారుడు వెంక‌ట సుబ్బ‌య్య‌ తన కుటుంబానికి జగన్ తీవ్రమైన అన్యాయం చేశారని వాపోయారు.

అక్కడితో ఆగకుండా జగన్ మోసం చేశారని ... అసలు ఇది తాము ఊహించలేదని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో తమకు టిక్కెట్ ఇవ్వకపోయినా ... తమ తాహతుకు మించి ఆర్థికంగా ఖర్చు చేశామని ... జగన్ మంత్రి పదవి ఇస్తానని చెప్పి రెండున్నర సంవత్సరాలు దాటుతున్నా ఇప్పటివరకు తమ‌ను పట్టించుకోలేదని ఆయన వాపోయారు. పైగా కొద్ది రోజుల క్రితం పార్టీలో చేరిన గుంటూరు జిల్లాకు చెందిన మారుగుడు హనుమంతరావుకు ఎమ్మెల్సీ ఇచ్చి తమను పట్టించుకోకపోవడం దారుణం అని  వెంకట సుబ్బయ్య వైసీపీ అధిష్టానంపై పబ్లిక్ లో తన అసంతృప్తి వ్యక్తం చేశారు.

వెంకట సుబ్బయ్య ఈవ్యాఖ్యలు చేస్తున్న సమయంలో మర్రి రాజశేఖర్ కూడా పక్కనే ఉన్నారు. గుండెల్లో పెట్టుకుంటా ... మిమ్మల్ని జాగ్రత్త గా చూసుకుంటా అని చెప్పిన జగన్ ... ఇంత మోసం చేస్తాడని తాము భావించ లేదని ఆయన వాపోయారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: