ఆశ వర్కర్కు 'ఫోర్బ్స్' జాబితాలో చోటు.. ఎలా సాధ్యమైందంటే?
కోట్ల రూపాయలు సంపాదించిన సంపన్నురాలు కూడా కాదు. కార్పోరేట్ ప్రపంచానికి ఆమె చాలా దూరం. ఇక ఆమెకు కార్లు బంగ్లాలు లాంటివి లేవు. కేవలం ఒక సైకిల్ ఉంది. సైకిల్ పైన ఊరంతా తిరుగుతూ ఉంటుంది. ఊరంతా తిరుగుతూ అందరికీ వ్యాక్సిన్లు వేయించడం, పౌష్టికాహారం అందించడం ఒక గ్రామంలో పరిశుభ్రతను ప్రోత్సహించడమే ఆమె పని. ఆమెకు తెలిసిన ప్రపంచం మొత్తం ఇదే. అయితే ఆమె అంకిత భావమే ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకునేల చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. స్వశక్తి వంతులైన మహిళల జాబితాలో ఆమెకు ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కింది.
ఒడిశాకు చెందిన మతిల్దా కుళ్ళు అనే మహిళ ఎన్నో ఏళ్లుగా ఆశా వర్కర్ గా పనిచేస్తుంది.. ఉదయం ఐదు గంటలకే లేచి తనకున్న సైకిల్ పై గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్తుంది. ఇక రోగులకు మందులు అందించడం గర్భిణీలకు సహాయపడటం లాంటివి చేస్తుంది.. పిల్లలకు ఇంటింటికి తిరుగుతూ వ్యాక్సిన్లు ఇస్తూ ఉంటుంది.. గ్రామంలో పరిశుభ్రత గురించి కూడా ఎంతగానో పాటుపడుతూ ఉంటుంది. కరోనా సమయంలో క్లిష్ట పరిస్థితుల్లో ఫ్రంట్లైన్ వర్కర్గా ఎంతోమంది ప్రాణాలను తన ప్రాణాలను పణంగా పెట్టి మరి కాపాడింది. ఈమె అంకితభావం గురించి ఫోర్బ్స్ కు తెలిసింది. దీంతో ఆమెకు శక్తిమంతులైన మహిళల జాబితాలో చోటు కల్పించి ఫోర్బ్స్ ఆ మహిళకు అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. ఇక ఈ మహిళలకు ఎంతో అరుదైన గౌరవం దక్కడం పై ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హర్షం వ్యక్తం చేశారు.