సమాజంలో మహిళలకు ప్రత్యేక భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుంది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. మహిళల భద్రత కోసం హైదరాబాద్ యువకులు రూపొందించిన సేఫ్టీ జాకెట్ ‘అభయ కోట్’ ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు.. మహిళల భద్రత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రధాన ఎజెండా అని అన్నారు. మహిళల రక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా `షీ టీం` లు ఏర్పాటు చేసామని వెల్లడించారు. ఆడబిడ్డల పై అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుందని పేర్కొన్నారు.
దివ్యాంగ మహిళల రక్షణ కోసం ప్రత్యేక పరికరాలను రూపొందించిన యువకులు దినేష్, శశాంక్ రెడ్డి, దినేష్ రెడ్డిలను అభినందించారు ఎమ్మెల్సీ కవిత. వీరు రూపొందించిన ఈ ప్రత్యేక భద్రత జాకెట్ వినికిడి , మాట్లాడడం సమస్య ఉన్న మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుంది తెలిపారు. ఎలాంటి సందర్భంలో అయినా ప్యానిక్ బటన్ ప్రెస్ చేస్తే వెంటనే సైరన్ మోగడంతో పాటు, ఎలక్ట్రిక్ షాక్ కూడా వచ్చేలా ప్రత్యేకంగా జాకెట్ లో ఏర్పాట్లు చేశారని వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళల ఆత్మరక్షణ కు, ఇతరులను అప్రమత్తం చేయడానికి ఈ ప్రత్యేక ‘అభయ కోట్’ జాకెట్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.
కుటుంబ సభ్యులకు, సమీపంలోని పోలీస్ స్టేషన్ కు లొకేషన్ మెసేజ్ వెళ్లేందుకు సైతం ప్రత్యేక జీపీఎస్ వ్యవస్థను చేశారని తెలుపుతూ యువకులను అభినందించారు ఎమ్మెల్సీ కవిత. ఉద్యోగం కోసం దూర ప్రాంతాలకు వెళ్లే మహిళలకు , మరీ ముఖ్యంగా నైట్ షిఫ్టులు చేసే మహిళా ఉద్యోగులకు ఈ ‘అభయ కోట్` భద్రతా జాకెట్ ఎంతగానో ఉపయోగపడుతుందని, ఇది ధరించడం ద్వారా మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరిగి ముందుకు సాగుతారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికలయిన విషయం తెలిసిందే.