మళ్లీ వాన గండం... క్షణక్షణం భయం భయం..!
ఇప్పుడు మరో గండం ప్రజలను గడగడ లాడిస్తోంది. వర్షం తగ్గుముఖం పట్టిందని సంతోష పడేలోపే... వాతావరణ శాఖ అధికారుల హెచ్చరిక భయపెడుతోంది. బంగావలాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది, వాయుగుండం ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. దీంతో అప్రమత్తమైన తమిళ సర్కార్... పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. జలాశయాలన్ని నిండుకుండలను తలపిస్తుండటంతో... దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. కన్యాకుమారి, రామనాథపురం, తిరునల్వేలి జిల్లాలపై వరుణ ప్రభావం అధికాంగా ఉంటుందన్నారు. పుదుచ్చేరి, కరైకల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అల్పపీడన ప్రభావంతో అటు శ్రీలంక, ఇటు రాయలసీమ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. లోతట్టు ప్రాంతల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.