ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది ఈ దేశంలో అమాయకత్వం ఇంకా బతికి ఉందంటే కారణం కాంగ్రెస్ పార్టీనే అని. అంతర్గత ప్రజాస్వామ్యం అన్న పదాన్ని ఆ పార్టీ నేతలు వాడినంత విచ్చలవిడిగా ఎవ్వరు వాడలేదు. ఒక్కసారి వాడకం అన్నది మొదలు పెడితే ఎలా ఉంటుందో ఈ దేశానికి పరిచయం చేసింది కూడా కాంగ్రెసోల్లే. ఎవరు ఎవరి మీదైనా ఎలాంటి కామెంట్లయినా చేయొచ్చు. దానివల్ల రేగిన వివాదాన్ని సెపరేట్ చేసే లోపే జరగాల్సిన నష్టం కాస్త జరిగిపోతూ ఉంటుంది. ఒక్క తెలంగాణలో మాత్రమే కాదు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ పరిస్థితి ఇదే.
ప్రస్తుతం తెలంగాణలో బలపడేందుకు హస్తం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. హుజురాబాద్ పరిణామాలు షాక్ కు గురి చేయగా, ఇప్పటికే ఫలితాలపై పోస్టుమార్టం నిర్వహించింది. ఇకపై ఎలా ముందుకు వెళ్లాలనివ్యూహాలు రచిస్తోంది. ఇదంతా ఎలా ఉన్నా పార్టీ శ్రేణులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది కాంగ్రెస్.ఇందులో ఏ అంశాలు చర్చించబోతున్నారు? ఎలాంటి శిక్షణ ఇవ్వబోతున్నారు? వివాదాలకు ఈ తరగతులు పులిస్టాప్ పెడతాయా? శిక్షణ కార్యకర్తలకేనా ? నాయకులకు అవసరం లేదా? క్రమశిక్షణ గాంధీ భవన్ దాటేసి ఎప్పుడో బయటికి వెళ్లి పోయిందా? అయితే మొదటి రోజు మీటింగ్ లోనే రసాభాస జరిగింది. శిక్షణా తరగతులకు పాసులు ఇవ్వలేదని జనగాం నియోజక వర్గానికి చెందిన నేతలు ఆందోళన చేశారు.బ్లాక్ కాంగ్రెస్, మండల కాంగ్రెస్ అధ్యక్షులను కాదని కొత్తవారికి పాసులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శిక్షణ తరగతుల్లోనే ఇలాంటి గొడవలు పెడితే, ఇక క్రమశిక్షణ ఎక్కడుంటుంది . ట్రైనింగ్ క్లాసులు తో కాంగ్రెస్ లో మార్పు తీసుకు రావడం సాధ్యమా..? పార్టీలో సీనియర్ సిటిజన్స్ క్లాస్ తీసుకుంటారా, క్లాస్ వింటారా? అంతర్గత ప్రజాస్వామ్యం గురించి కూడా క్లాసులు ఉంటాయా? అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు ఇంతేనా అంటూ తరగతులకు హాజరైన చిన్నారులు గుసగుసలాడటం కనిపించింది. శిక్షణా తరగతులలోనే క్రమశిక్షణ కనిపించకపోతే ఎలా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కొన్ని కార్యక్రమాలు ప్లాన్ చేస్తోంది. అయితే వాటిని ఎలా సక్సెస్ చేయాలన్నదానిపై పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి కార్యకర్తలకు దిశానిర్దేశం చేయబోతున్నారు.
మూడు నెలల్లో 30 లక్షల సభ్యత్వాలతో పాటు ఈ నెలలో జరగనున్న జనజాగరణ పాదయాత్రలో అనుసరించాల్సిన వ్యూహాలు, డిసెంబర్ 9న నిర్వహించబోయే నిరుద్యోగ జంగ్ సైరన్ కు సంబంధించి పార్టీ శ్రేణులకు ఆయన సూచనలు చేస్తారు. విద్యుత్, వ్యవసాయం, పోడు భూముల సమస్యలపై కూడా ప్రసంగాలు జరగనున్నాయి. శిక్షణ తరగతులకు హాజరైన ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. ప్రతి పాఠశాలలో రాసి ఉంటుంది. క్రమశిక్షణ తప్ప రాదని. ప్రతి ఆట స్థలం లో రాసుంటుంది, నియమాలు తప్ప రాదని. మరి గాంధీ భవన్ పాఠశాలా లేక ఆట స్థలమా. ఆధిపత్యం అనే పాఠశాలలో అసూయ అనే ఆట స్థలం లో క్రమశిక్షణకు,నియమాలకు చోటు లేదు.