ఉద్యోగులకు దీపావళి కానుకగా ఎలక్ట్రిక్ స్కూటర్లు..?
అసలే పెట్రోలు ధరలు మండిపోతున్నాయి. ఉద్యోగులు ఆఫీసుకు వచ్చి పోవాలన్నా ఆర్థికంగా భారంగా మారుతోంది. ఈ పరిస్థితి గమనించిన సూరత్లోని అలయన్స్ సంస్థ అధినేత తమ ఉద్యోగులకు ఊరట కలిగించాలనుకున్నాడు. అందుకే ఈసారి దీపావళి కానుకతో ఉద్యోగులను ఆశ్చర్య, ఆనందాల్లో ముంచెత్తాడు. వారందరికీ ఎలక్ట్రిక్ బైక్లు దీపావళి రోజే అందించాడు. ఇక తమ ఉద్యోగులకు పెట్రోల్ కష్టాలు తప్పినట్లే అంటున్నాడా యజమాని.
తమ యజమాని తమ సమస్యను అర్థం చేసుకుని ఇంత మంచి కానుక ఇవ్వడం తాము మరచిపోలేమని ఉద్యోగులు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఉద్యోగులతో ఇంకా ఎంత ఎక్కువ పని చేయించాలా అని ఆలోచించే యజమానులు చాలా మంది ఉంటారు.. కానీ.. ఉద్యోగుల బాగోగులు పట్టించుకునే యజమానులు చాలా తక్కువ అనే చెప్పాలి. తమ అలయన్స్ సంస్థ యజమాని మాత్రం ఉద్యోగుల బాగోగులు చూసుకునే మా మంచి యజమాని అని ఉద్యోగులు మురిసిపోతున్నారు.
చాలా సంస్థలు.. ఉద్యోగులకు కల్పించాల్సిన కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా శ్రమ దోపిడీ సాగిస్తుంటాయి. ఉద్యోగులకు ఇవ్వాల్సిన సెలవులు, బోనస్లు వంటి వాటి విషయంలో పిసినారి తనం చూపిస్తుంటాయి. అలా చేయడం వల్ల తమకు ఆర్థికంగా లాభం అని చాలా మంది యజమానులు భావిస్తారు. కానీ.. ఉద్యోగులను సంతోషంగా ఉంచి.. వారితో మరింత మెరుగైన పని చేయించుకోవడమే తన పాలసీ అంటున్నాడీ అలయన్స్ సంస్థ యజమాని. ఇలాంటి యజమానుల కోసం ఎంత పనైనా చేసేందుకు ఉద్యోగులు కూడా ముందుకు వస్తారు.